హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కరువు ముప్పు లేదని, తమకు ఉన్నదని ఏపీ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట నివేదించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో గురువారం సైతం కొనసాగింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట ఏపీ తన వాదనలను కొనసాగించింది. బేసిన్లోని జనాభానే ప్రామాణికంగా తీసుకున్నారని, కృష్ణా వాటర్ అందరూ వాడుకుంటారని, ఔట్సైడ్ బేసిన్కూ అవకాశమున్నదని వెల్లడించింది.
అదీగాక కరువు ముప్పు తమకే ఉన్నదని, తెలంగాణకు లేదని, ఈ నేపథ్యంలో బేసిన్ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవద్దని, అవసరాలనూ లెకలోకి తీసుకోవాలని ట్రిబ్యునల్ను కోరింది. జనాభా ప్రకారం తలసరి నీటి వినియోగం లెక్కలు కరెక్ట్ కాదని, జాతీయ సగటుకన్నా తెలంగాణకు ఎకువ ఉన్నదని తెలిపింది. ఔట్సైడ్ బేసిన్కు వాడుతున్న నీళ్లనూ పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడించింది.
శ్రీశైలం వద్ద ఆవిరి నష్టాల్లోని 33 టీఎంసీలను మూడు రీజియన్లకు 11 టీఎంసీల చొప్పున పంచాలని, ఏపీకి 22 టీఎంసీలు కేటాయించాలని ప్రతిపాదించింది. కేడీఎస్ కింద పులిచింతలను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వాడుతున్నామని ఈ నేపథ్యంలో 9 టీఎంసీల ఆవిరి నష్టాలు కూడా తమకే ఇవ్వాలని వెల్లడించింది. సాగర్ కింద పెంచిన 2.5 లక్షల ఆయకట్టును పరిగణనలోకి తీసుకోవద్దని, కేవలం లోకలైజ్డ్ ఆయకట్టునే చూడాలని వాదించింది.
అదేవిధంగా పంటల విధానంపై తాము సమర్పించిన లెక్కల్లో తప్పులేం లేవని, లోకల్గా క్రాప్ డాటా లేకుంటే ఎఫ్ఏవో మాన్యువల్స్ 1984 గైడ్లైన్స్ అంశాల ప్రకారం తీసుకోవచ్చని సమర్థించుకున్నది. బేసిన్ పారామీటర్లు, జనాభా, కేసు వివరాలతో 40 పేజీలకు మించకుండా ఇరు రాష్ర్టాలు వివరాలను సమర్పించాలని ట్రిబ్యునల్ ఈ సందర్భంగా సూచించింది. ట్రిబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు గురువారంతో ముగిశాయి. ఏపీ లేవనెత్తిన అంశాలపై తెలంగాణ నేటి నుంచి వివరణలు ఇవ్వనున్నది.