హైదరాబాద్, ఆగస్టు 13, (నమస్తే తెలంగాణ): కొడంగల్ ఎత్తిపోతల పథకం, లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్కు భూముల కేటాయింపులో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ లోకాయుక్తను గురువారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఆశ్రయించారు. లోకాయుక్తను కలిసిన వారిలో నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఉన్నారు.
ఈ సందర్భంగా లోకాయుక్త కార్యాలయం ఎదుట నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ ప్రక్రియలో తీవ్రస్థాయిలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నిజమైన భూ నిర్వాసితులకు పరిహారం అందించకుండా, వారి స్థానంలో కాంగ్రెస్ నాయకులు తమ అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు కుట్ర పన్నారని తెలిపారు. భూ నిర్వాసితుల జాబితాను ఇప్పటికే మూడుసార్లు మార్చారని, నచ్చిన పేర్లను అక్రమంగా చేరుస్తున్నారని మండిపడ్డారు.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మాట్లాడు తూ సీఎం రేవంత్రెడ్డి, ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి, కొందరు అధికారులు కుమ్మకై కొడంగల్, లగచర్ల ప్రాం తాల్లో భూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ దందాలను ప్రోత్సహిస్తూ ఇండస్ట్రియల్ కారిడార్కు కేటాయించిన స్థలాల్లో కాంగ్రెస్ నాయకులే పెద్ద ఎత్తున అక్రమ లే అవుట్లు ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే భూ కేటాయింపులు, లే అవుట్లపై తక్షణమే విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ కొడంగల్ ఎత్తిపోతల పథకం కేవలం కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు గుంజడానికే ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నదని స్పష్టంచేశారు. కాలువల ద్వారా కాకుండా 90 కిలోమీటర్ల మేర పైప్లైన్ల ద్వారా నీటిని తరలించడం అత్యంత కష్టమని చెప్పారు.
ఈ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పర్యావరణ శాఖ అనుమతులు లేవని, దీని నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో విచారణ పెండింగ్లో ఉన్నదని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్కు మేలు చేకూర్చడానికే నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారని, ఇందులో వేల కోట్ల రూపాయల అవినీతి దాగి ఉన్నదని ఆరోపించారు.