త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఉమ్మడి వరంగల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో శుక్రవారం 75వ గణతంత్ర వేడుక అంబరాన్నంటింది. కలెక్టర్లు ఎక్కడికక్కడ జాతీయ జెండాలను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతిని వివరించారు. వేడుకలను పురస్కరించుకొని విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించి, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సీపీ అంబర్కిశోర్ ఝాతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, రాధికాగుప్తా పాల్గొన్నారు. అలాగే వరంగల్లోని ఖుష్మహల్లో కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, డీసీపీ రవీందర్, జనగామలోని ధర్మకంచ స్టేడియంలో కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య, వెస్ట్జోన్ డీసీపీ సీతారాం, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ కొత్త బస్సును ప్రారంభించిన కలెక్టర్ శివలింగయ్య.. డ్రైవర్ ఎండీ దావుద్కు ప్రశంసా పత్రాన్ని బస్సులోనే అందజేశారు. ఆ తర్వాత సతీమణి వందన, కుమారుడు రుత్విక్, డీసీపీ సీతారాం, అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, పింకేశ్కుమార్, ఆర్టీసీ డీఎం జ్యోత్స్నతో కలిసి కొద్దిదూరం ప్రయాణించారు.
మహబూబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, ఎస్పీ సంగ్రామ్సింగ్ పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే మురళీనాయక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అంబేద్కర్ స్టేడియంలో కలెక్టర్ భవేశ్మిశ్రా, ఎస్పీ కిరణ్ఖరే, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, ములుగులోని తంగేడు మైదానంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్లు శ్రీజ, వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ప్రశంసా పత్రా లు అందించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. వేడుకల సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించి న సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకోగా ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు.