చెరువుల్లో చేప పిల్లల విడుదలకు మత్స్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 703 చెరువులు, రిజర్వాయర్లలో 1.94 కోట్ల చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. కాంట్రాక్టర్ల ఎంపికకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. ఆగస్టు నుంచి తటాకాల్లో చేపపిల్లల విడుదలకు కసరత్తు చేస్తున్నారు. గతేడాది 1.91 కోట్లు సరఫరా చేయగా, మత్స్యకారులు రూ.75.52 కోట్ల ఆదాయం పొందినట్లు మత్స్యశాఖ జిల్లా అధికారి నరేశ్కుమార్ నాయుడు వెల్లడించారు.
వరంగల్, జూన్ 23(నమస్తేతెలంగాణ) : మత్స్యకారుల ఉపాధి కోసం ఈ ఏడాది వరంగల్ జిల్లాలోని చెరువుల్లో 1.94 కోట్ల ఉచిత చేప పిల్లలను వదలాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మత్స్యశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నది. ఈ నేపథ్యంలో మత్సకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రతి సంవత్సరం చేప పిల్లలను ఉచితంగా సరఫరా చేస్తున్నది. మత్స్యశాఖ అధికారులు వీటిని వానకాలంలో చెరువులు, రిజర్వాయర్లలో వదులుతున్నారు. పెరిగిన తర్వాత వీటిని విక్రయించడం ద్వారా మత్స్యకారులు ఆదాయాన్ని పొందుతున్నారు. జిల్లాలో 693 చెరువులు, 9 శాశ్వత నీటి వనరులతో పాటు రాయపర్తి మండలంలోని మైలారంలో ఒక రిజర్వాయర్ ఉన్నది. వీటి పరిధిలో 182 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 40 మహిళా సంఘాలు ఉండడం విశేషం.
ఈ సంఘాల్లో 14,350 మంది మత్సకారులు ఉన్నారు. వీరిలో మహిళలు 3,400 మందికిపైగా ఉన్నట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. ఏటా వానకాలం చెరువులు, రిజర్వాయర్లలోకి నీరు రాగానే ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను వదులుతున్నది. వీటిలో బొచ్చె, రవ్వు, బంగారుతీగ, మెరిగె రకాల చేప పిల్లలు ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను వదలడం మొదలు పెడుతున్నారు. గత ఏడాది 1.91 కోట్ల చేప పిల్లలను విడుదల చేశారు. వీటి విలువ సుమారు రూ.1.30 కోట్లు. ఇవి పెరిగిన తర్వాత మొత్తం 9,420 మెట్రిక్ టన్నుల చేపలను పట్టి అమ్ముకున్నట్లు మత్స్యశాఖ అధికారులు చెప్పారు. మార్కెట్లో కిలోకు ధర రూ.80 చొప్పున మత్స్యకారులలు విక్రయించారని, దాదాపు రూ.75.52 కోట్ల ఆదాయం పొందారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొద్ది రోజుల క్రితం ఊరూరా జరిగిన చెరువుల పండుగ కార్యక్రమంలో మత్స్యకారులు సంబురాలు జరుపుకున్నారు.
ఈసారి నిర్దేశిత లక్ష్యం..
ఈ ఏడాది జిల్లాలోని 703 చెరువులు, రిజర్వాయర్లలో 1.94 కోట్ల చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించినట్లు మత్స్యశాఖ జిల్లా అధికారి నరేశ్కుమార్ నాయుడు వెల్లడించారు. 693 చెరువుల్లో 1,57,56,000, మైలారం రిజర్వాయర్ సహా తొమ్మిది శాశ్వత నీటి వనరుల్లో 36,48,000 చేప పిల్లలను వదలడానికి ప్లాన్ చేసినట్లు ఆయన చెప్పారు. చెరువుల్లో చిన్న సైజు బొచ్చెలు, బంగారుతీగ, రవ్వు, మైలారం రిజర్వాయర్ సహా శాశ్వత నీటి వనరుల్లో పెద్ద సైజు మెరిగె, బంగారుతీగ, రవ్వు చేప పిల్లలను వదులుతామని తెలిపారు. జిల్లాలోని రిజర్వాయర్, చెరువుల్లో ఈ ఏడాది వదలే చేప పిల్లలను సరఫరా చేసే కాంట్రాక్టర్లను ఎంపిక చేయడానికి టెండర్ల ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్ల పరిధిలోని మత్స్యకారులకు ఆగస్టు నుంచి 1.94 కోట్ల ఉచిత చేప పిల్లలను సరఫరా చేస్తారు. అలాగే ప్రభుత్వం ఏటా నూరు శాతం సబ్సిడీపై రొయ్య పిల్లలనూ వదులుతోంది. గత ఏడాది మైలారం రిజర్వాయర్లో 4.55 లక్షల రొయ్య పిల్లలను వదిలింది. ఈ ఏడాదీ వదిలేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చేప పిల్లల విడుదల తర్వాత వీటిని వదలడం మొదలు పెడుతారు.