కరీమాబాద్, డిసెంబర్ 3: దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి వివిధ పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం గ్రేటర్ వరంగల్ 39వ డివిజన్కు చెందిన బీజేపీ నాయకుడు బొరిగం నాగరాజు తన అనుచరులు 700 మందితో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని మాట్లాడుతూ ప్రజలంతా టీఆర్ఎస్ వైపు ఉన్నారని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో టీఆర్ఎస్కు ఎదురులేదన్నారు. అభివృద్ది, సంక్షేమంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారని వివరించారు.
పార్టీని నమ్ముకుని వచ్చిన వారికి అండగా ఉంటామన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కొత్త, పాత అని తేడా లేకుండా నాయకులు కలసికట్టుగా ముందుకు సాగాలని ఆయన కోరారు. సీఎం కేసీఆర్ సహకారం, మంత్రి కేటీఆర్ అండదండలతో నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని నరేందర్ తెలిపారు. కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేపడతామన్నారు. టీఆర్ఎస్లోనే సామాన్యులకు సైతం అవకాశాలు వస్తాయన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా పనిచేయాలని ఆయన కోరారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అడ్డుపుడుతున్నదని, దీనికి వ్యతిరేకంగా పోరాడాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రజల కోసం చేస్తున్న పనులను క్షేత్రస్థాయిలో వివరించాలన్నారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. వరంగల్ ఎంపీ దయాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిద్దం రాజు, మాజీ కార్పొరేటర్ పల్లం రవి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.