ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా జలకళ కనిపిస్తోంది. కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతో పాటు ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టుల స్థిరీకరణతో ఉమ్మడి జిల్లాలోని దాదాపు ప్రతి చెరువుకూ నీళ్లు చేరాయి. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సాగునీటి శాఖ పరిధిలో 6,030 చెరువులు, పెద్ద కుంటలు ఉన్నాయి. వీటిలో 2,804 చెరువులు ఇప్పుడు అలుగు పోస్తున్నాయి. మరో 3,218 చెరువులు సగటున 75 శాతం నుంచి పూర్తిగా నిండి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు అన్ని చెరువుల్లోకి పూర్తిగా నీళ్లు చేరలేదు. ఇప్పుడు మండు వేసవిలోనూ నిండుగా నీళ్లు ఉంటుండడంతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. చెరువులు అలుగు పడుతున్న దృశ్యాలు పల్లెలకు నిండుదనం తెచ్చాయి. ఈ సారి వానకాలానికి సమానంగా యాసంగిలో వరి సాగయ్యే పరిస్థితి ఉన్నది.
వరంగల్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలోని పల్లెలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు వరంగల్ ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వలకు మరమ్మతులు చేయడం, దేవాదులను స్థిరీకరించడంతో ఆరు జిల్లాలు సస్యశ్యామలంగా మారాయి. దేవాదుల ప్రాజెక్టు రిజర్వాయర్లు, కాల్వల పెండింగ్ పనులను పూర్తి చేయడం కరువు ప్రాంతాలకు కలిసి వచ్చింది. మొత్తంగా సాగునీటి ప్రాజెక్టులతో ఉమ్మడి జిల్లాలోని దాదాపు ప్రతి చెరువుకూ నీళ్లు చేరాయి. మిషన్ కాకతీయ పథకంతో చెరువులను బాగు చేయడంతో నీళ్లన్నీ నిల్వ ఉంటున్నాయి. పంటలకు ఏడాదంతా సరిపోయేలా నీటి వనరులు ఉన్నాయి.
మన నీళ్లు మనకే నినాదం సాకారమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుతో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతున్నది. తాగేందుకు నీళ్లు లేని పరిస్థితి నుంచి నడి ఎండాకాలంలోనూ ఎక్కడ చూసినా నీళ్లే అనేలా తెలంగాణలో మార్పు వచ్చింది. సీఎం కేసీఆర్ కృషితోనే ఇది సాధ్యమైంది. సమగ్ర అభివృద్ధిలో కీలకమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రణాళికలో భాగంగా కేసీఆర్ సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అన్ని గ్రామాలకు సాగునీరు చేరుతున్నది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, దేవాదుల ఎత్తిపోతల కింద ఉన్న భూములకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా చర్యలు చేపట్టింది. వేగంగా పనులు పూర్తి చేసింది. ఇప్పుడు యాసంగిలోనూ ప్రతి ఎకరాకు పుష్కలంగా సాగునీరు అందుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) కింద లోయర్ మానేరు డ్యాం నుంచి వర్ధన్నపేట మండలం ఇల్లంద వరకు మొదటి దశలో 5,05,725 ఎకరాల ఆయకట్టు ఉన్నది. రెండో దశ పరిధిలో ఇల్లంద తర్వాత నుంచి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వరకు 3,65,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. రెండు దశల్లోని మొత్తం 8.70 లక్షల ఆయకట్టుకు యాసంగిలో నీటి సరఫరా అవుతున్నది. ఎస్సారెస్పీ రెండు దశల్లో పంటల సాగు అవసరాలతో పాటు చెరువులు, రిజర్వాయర్లకు నీటి సరఫరా మెరుగైంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ పాత జిల్లాల పరిధిలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందుతున్నది. సాగు అవసరాల కోసం దాదాపు 40 టీఎంసీల వరకు నీటి విడుదల చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిది. ఉమ్మడి జిల్లాలో ఎస్సారెస్పీ రెండు దశల్లో కలిపి 4,72,287 ఎకరాల ఆయకట్టు ఉన్నది. హనుమకొండ సర్కిల్ పరిధిలోని హుజూరాబాద్, హనుమకొండ, మహబూబాబాద్ డివిజన్లలో ఈ ఆయకట్టు ఉన్నది. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 31 డిస్ట్రిబ్యూటరీలను నీటి విడుదలకు అనుగుణంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది.
ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జల వనరుల శాఖకు కొత్త రూపు తెచ్చింది. ప్రాజెక్టులు, కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు, పంపుహౌస్ల నిర్వహణ పక్కాగా ఉండేలా మార్పులు చేసింది. వరంగల్ పాత జిల్లా పరిధిని వరంగల్, ములుగు చీఫ్ ఇంజినీర్(సీఈ) సర్కిళ్లుగా ఏర్పాటు చేసింది. రెండు సర్కిళ్లలో కలిపి 13.86 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. వరంగల్ సీఈ పరిధిలో 9.64 లక్షల ఎకరాలు, ములుగు సీఈ పర్యవేక్షణలో 4.22 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ప్రతి ఎకరాకు ఏడాది పొడవునా సాగు నీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసింది. దేవాదుల, ఎస్సారెస్పీ ఆయకట్టును స్థిరీకరించే సమ్మక్క బరాజ్(తుపాకులగూడెం) పనులు పూర్తయ్యాయి. 6.94 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ బరాజ్ పనులు పూర్తయ్యాయి. 1,143 మీటర్ల పొడవుతో ఉండే ఈ బరాజ్లో 59 రేడియల్ గేట్లను అమర్చారు. రూ.1,508 కోట్ల అంచనాతో పనులు పూర్తి చేశారు. తుపాలగూడెం బరాజ్ బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇక్కడ 240 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరిగేలా దీని నిర్మాణం జరుగుతున్నది.
తుపాకులగూడేనికి పైన గంగారం వద్ద ఏర్పాటు చేసిన పంపులతో ఎత్తిపోతల ద్వారా దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. దేవాదుల వద్ద గోదావరి నీటి మట్టం 71 మీటర్లు ఉన్నప్పుడే మోటర్లు నడుస్తాయి. వానకాలంలోనే ఈ మేరకు నీటి మట్టం ఉంటున్నది. గోదావరిలో వరద ఉన్న రోజుల్లోనే పంపింగ్ ఉంటుంది. ఇలా గరిష్ఠంగా ఏడాదిలో మూడు నెలలపాటే నీటి సరఫరా ఉంటుంది. వరద తక్కువ ఉన్న సీజన్లలో ఒక్కోసారి వానకాలం పంటలకు సైతం ఇబ్బంది అవుతున్నది. దీంతో ఏడాది పొడవునా పంటలకు సాగునీరు అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద బరాజ్ నిర్మాణం చేపట్టారు. దేవాదుల పంప్ హౌస్కు ఐదు కిలోమీటర్ల దిగువన ఈ బరాజ్ను 92 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు. 83 మీటర్ల మేరకు నీటిని నిల్వ చేయడం వల్ల దేవాదుల వరకు బ్యాక్ వాటర్ ఉంటున్నది. ఏడాది పొడవునా పంపులు నడిచేలా 71 మీటర్ల వరకు నీటి మట్టం ఉంటున్నది. తుపాలగూడెం బరాజ్ నిర్మాణం పూర్తయితే దేవాదుల ప్రాజెక్టు పరిధిలో ఉండే పాత వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లోని 6.21 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. దీంతో ఎస్సారెస్పీ పరిధిలోని 7.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది.