భూపాలపల్లి రూరల్, డిసెంబర్ 27: భూపాలపల్లి సింగరేణి ఏరియాలో బుధవారం జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు కొనసాగింది. ఎన్నికల్లో మొత్తం 13 కార్మిక సంఘాలు పోటీ చేశాయి. సింగరేణి యాజమాన్యం 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,410 మందికి 5,123 కార్మికులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు 16.5 శాతం, 11 గంటలకు 53.2 శాతం, మధ్యాహం ఒంటి గంటకు 67.3 శాతం, సాయంత్రం 5 గంటల వరకు 94.7 శాతం నమోదైంది.
కేటీకే -5 ఇైంక్లెన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు రెడ్ టీషర్ట్లు ధరించి వెళ్తుతుండగా పోలీసులు, ఐఎన్టీయూసీ నాయకులు అడ్డుకోగా ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. కేటీకే -2 ఇైంక్లెన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ నాయకులు కాంగ్రెస్ కండువాలు వేసుకొని వెళ్లగా పోలీసు అధికారులు వారిని అడ్డుకోగా వారి మధ్య తీవ్ర వాగ్వావాదం జరిగింది. ఎస్పీ కిరణ్ ఖరే, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఐదుగురు బృందం ఎన్నికల సరళిని పర్యవేక్షించింది. 9 పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్లను అంబేద్కర్ స్టేడియంలోని మినీ ఫంక్షన్ హాల్కు తరలించారు. సాయంత్రం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 5 టేబుళ్లను ఏర్పాటు చేసి రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించి అర్ధరాత్రి వరకు ఫలితాలు తెలుపనున్నారు.