మున్సిపల్ సంగ్రామానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో 260 వార్డుల్లో పోలింగ్ నిర్వహించేందుకు 525 పోలింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామగ్రి తీసుకొని ప్రత్యేక బస్సుల్లో కేంద్రాలకు తరలివెళ్లగా, పోలింగ్ సజావుగా సాగేందుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. కాగా, బీఆర్ఎస్ పార్టీ గెలుపు ధీమాతో ఉండగా, కేటీఆర్ ప్రచారంతో మరింత ఊపందు కుంది. కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా ఉండడంతో ఆ పార్టీలో నైరాశ్యం నెలకొంది.
– వరంగల్, ఫిబ్రవరి 10
ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల, ములుగు, స్టేషన్ఘన్పూర్, తొర్రూరు, కేసముద్రం, డోర్నకల్, మరిపెడ, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లోని 260 వార్డులకు జరిగే ఎన్నికల్లో 3,34,272 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 600 నుంచి 700 ఓటర్లు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సెక్టోరియల్, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో పాటు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఐదుగురు చొప్పున సిబ్బందిని నియమించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, అతి సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. మంగళవారం ఎన్నికల సిబ్బందికి సామగ్రిని అందజేసి బస్సుల్లో ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. సెంటర్లలో మౌలిక వసతులు కల్పించారు. వృద్ధులు, దివ్యాంగులకు సహాయంగా వలంటీర్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్లను భద్రపర్చడానికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. హరిత పోలింగ్ స్టేషన్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ నినాదంతో ప్రత్యేక పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కాగా, పోలింగ్ సజావుగా సాగేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ ఎస్సీఆర్పీసీ 163ని అమలు చేస్తున్నారు.
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పట్ట ణాల్లో కొత్తగా ఎలాంటి అభివృద్ధి పను లు చేపట్టలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ పథకాల అమలులోనూ కాంగ్రె స్ ప్రభుత్వం విఫలమైంది. దీంతో పట్టణ ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకత నెలకొన్నది. ఈ క్రమంలో ప్రచారం చేయడానికి కూడా ఎమ్మెల్యేలు ఇబ్బంది పడ్డారు. మున్సిపల్ ఎన్నికలకు రెండుమూడు రోజులు మందు హ డావుడిగా ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయ డం ప్రజల్లో సానుకూలత రాలేదు. నిధులు మంజూరు చేయకుండా పనులు ప్రారంభిస్తే ఎలా పూర్తవుతాయనే చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా భూపాలపల్లిలో ప్రచారం నిర్వహించినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఎన్నికల ఫలితాలపై సందేహాలతో అధికార పార్టీ ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో అక్రమాలకు తెరలేపింది. బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులను పోలీసులతో బెదిరిస్తున్నది. ఓటర్లను ప్రలోభాలతో గెలిచే ప్రయత్నంలో నిమగ్నమైంది.
