జయశంకర్ భూపాలపల్లి, మార్చి 25 (నమస్తే తెలంగాణ)/ మొగుళ్లపల్లి/ టేకుమట్ల : రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ దేశానికే ఆదర్శంగా నిలిచాయని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. జిల్లాలో రూ.10కోట్లతో నిర్మించిన నాలుగు పోలీస్స్టేషన్ల భవనాలను ఆయన శనివారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, డీజీపీ అంజనీకుమార్, జడ్పీ చైర్పర్సన్లు శ్రీహర్షిణి, జ్యోతి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, కలెక్టర్ భవేశ్మిశ్రా, మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి, ఎస్పీ సురేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
మొగుళ్లపల్లి, టేకుమట్ల పీఎస్ల భవనాలను ప్రారంభించి, కాళేశ్వరం, పలిమెల పోలీస్స్టేషన్ల భవనాలను టేకుమట్ల నుంచి వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం సభలో హోమ్ మంత్రి మాట్లాడారు. పోలీస్ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించి ప్రతి పోలీస్స్టేషన్లో మహిళా సిబ్బంది అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దేశవ్యాప్తంగా వినియోగిస్తున్న సీసీ కెమెరాల్లో 64 శాతం మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేసి పటిష్ట నిఘా పెట్టామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ పోలీస్స్టేషన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పోలీస్స్టేషన్ల నిర్వహణకు నిధులు ఇస్తున్నదని, పట్టణంలోని పీఎస్కు రూ.75వేలు, రూరల్లో రూ.50వేలు, గ్రామీణ ప్రాంతంలో రూ.25వేలు ఇస్తున్నట్లు వివరించారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో క్రైం రేట్ గణనీయంగా తగ్గిందన్నారు. కాగా, డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.200కోట్లకు పైగా నిధులతో పోలీస్ కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. అందులో భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో రూ.38కోట్ల చొప్పున జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కొత్త భవన నిర్మాణానికి రూ.50కోట్ల నిధులు, 5వ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ భవన నిర్మాణం కోసం రూ.12.5కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. తాను 1991లో జనగామ ఏఎస్పీగా పని చేశానన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పు వచ్చిందని తెలిపారు.