ఉమ్మడి రాష్ట్రంలో కరంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక బుగ్గ దిక్కు చూస్తూ పడిగాపులు కాయాల్సిన దుస్థితి. రోజూ ఆరు, ఏడు గంటల కోతలకు తోడు అడపాదడపా వచ్చీ పోయే విద్యుత్తో చిరు వ్యాపారాలు కుదేలయ్యేవి. కానీ, ఏడేండ్లుగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ నిరంతర విద్యుత్ ఇస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏ ఒక్క వ్యాపారి కూడా కరంట్ కోసం క్షణం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి లేదు. అసలు కరంటు కోతలంటేనే వ్యాపారులు మర్చిపోయారు. 24గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుండడంతో సాఫీగా వ్యాపారం సాగిస్తున్నారు. సమైక్య పాలనలో కరంటు కోతలతో పనులు సాగక పస్తులు ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు. తమ ఆదాయం పెరుగడం సీఎం కేసీఆర్ చలువేనని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : వారు పేద, మధ్య తరగతి వారు. పెద్ద వ్యాపారాలు చేయడానికి వారి దగ్గర ఆర్థిక స్థోమత లేదు. బతుకుదెరువు కోసం వివిధ రకాల మెకానిక్, ఎలక్ట్రీషియన్ పనులు నేర్చుకొని షాపులు పెట్టుకొని జీవిస్తున్నారు. పని చేస్తేనే నాలుగు రూపాయలు వచ్చి కుటుంబ గడుస్తుంది. తెలంగాణ రాకముందు వీరి పరిస్థితి కడు దయనీయంగా ఉండేది. కరంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియకపోయేది. గంటల తరబడి కరంటు కోసం వేచిచూసేది. రిపేర్కు వచ్చిన ఫ్యాన్లు, టీవీలు ఇతర పరికరాలు ఇచ్చిన సమయంలోగా బాగు చేయకపోతే తిట్టేవారు. ఇలా అష్టకష్టాలు పడిన వీరు స్వరాష్ట్రంలో కోతల్లేని కరంటుతో ఊపిరిపీల్చుకున్నారు. తమ వద్దకు రిపేరుకు వచ్చిన వస్తువులను వెనువెంటనే బాగు చేసి వినియోగదారులకు ఇస్తున్నారు. గతం కంటే అదనంగా సంపాదిస్తున్నారు. సీఎం కేసీఆర్ దయతోనే విద్యుత్ మంచిగా వచ్చి నాలుగు రూపాయలు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్వరాష్ట్రంలో మెరుగుపడిన విద్యుత్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి కొత్తగా విద్యుత్ సబ్ స్టేషన్లను నెలకొల్పారు. అదనంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ప్రభుత్వం అమర్చింది. అవసరమైన చోట విద్యుత్ లైన్లను కూడా వేసింది. దీంతో విద్యుత్ సరఫరా గణనీయంగా మెరుగుపడింది. దీంతో టీవీ మెకానిక్లు, ఫ్యాన్లు, మిక్సీలు రిపేరు చేసే ఎలక్ట్రీషియన్స్, జిరాక్స్ సెంటర్ల నిర్వహకులు, కూల్డ్రింక్స్ అమ్ముకుంటూ జీవనం గడిపే చిరు వ్యాపారుల జీవితాల్లో సర్కార్ వెలుగులు నింపింది.
నాడు కరంటు లేక అవస్థ పడేది..
తెలంగాణ రాక ముందు కరంటు కష్టాలు చాలా ఉండేవి. వారానికి రెండు, మూడు రోజులు కూడా ఉండకపోయేది. నేను 2004లో ఈ షాపు పెట్టిన. ఫ్యాన్లు, మిక్సీలు, కూలర్లు రిపేర్ చేస్తా. చిన్న మోటర్లు వైండింగ్ చేస్తా. మిషన్తో వైండింగ్ చేద్దామంటే కరంటు ఉండకపోయేది. ఎన్నిసార్లు తిప్పుకుంటవని రిపేరుకు వస్తువులు ఇచ్చిన వారు తిట్టేది. విద్యుత్ ఎప్పుడొస్తదో తెలియక సమధానం చెప్పలేక సచ్చేటోళ్లం. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సారు 24గంటల కరంటు ఇస్తున్నడు. రిపేరుకు ఇచ్చిన వస్తువులను ఆరోజే బాగు చేసి ఇస్తున్న. ఇప్పుడు నాలుగు పైసలు అవుపడుతున్నయ్.
– ఎస్డీ మునావర్, ఎలక్ట్రీషియన్, భూపాలపల్లి
పూట గడవడం కష్టమయ్యేది..
రేగొండ : తెలంగాణ రాకముందు కరంటు కోతలతో షాపు సరిగా నడువడక పూటగడవడం కష్టమయ్యేది. కష్టమర్లు వచ్చినప్పుడు కరంటు లేక తిరిగిపోయేది. రోజు మొత్తం రూ.100 నుంచి రూ.200 మాత్రమే వచ్చేది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడేది. కూలీ పనులకు వెళ్లేది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ 24 గంటలు కరంటు ఇస్తుండడంతో ఇబ్బందిలేదు. ఇప్పుడు రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు సంపాదిస్తున్న. సీఎం కేసీఆర్ వల్ల ఉపాధి దొరుకుతుంది.
– పస్తం ఎర్రగట్టు, జిరాక్స్ షాపు యజమాని, రేగొండ
కుట్టు మిషన్కు మోటర్ పెట్టిన..
చిట్యాల : మిషన్ తొక్కుతూ దుస్తులు కుట్టడం ఇబ్బందిగా ఉండేది. రోజుకు ఒకటి, రెండు జాకెట్లు మాత్రమే కుట్టేది. ఉన్నది. ఇప్పుడు నిత్యం కరంటు ఉంటుండడంతో మోటర్ అమర్చుకున్న. దుస్తులు కుట్టుడు సులువైంది. సకాలంలో ఇస్తుండడంతో గిరాకీ కూడా పెరిగింది. కుటుంబ పోషణకు ఇబ్బందిలేదు. 24 గంటలు కరంటు ఇస్తున్న సీఎం కేసీఆర్సారుకు కృతజ్ఞతలు.
–పెండెం, శ్రావణి-కైలాపూర్, చిట్యాల మండలం
ఆయిల్ ఇంజిన్ మూలకేసిన..
బండ్ల (ద్విచక్ర వాహనాలు)ను బాగు చేసిన తర్వాత సర్వీసింగ్ చేయాలంటే ఏడుపొచ్చేది. కరంటు అసలే ఉండకపోయేది. ఈ బాధ నుంచి తప్పించుకోవడానికి ఆయిల్ ఇంజిన్ తెచ్చిన. తెలంగాణ సర్కారు వచ్చినంక ఎప్పటికీ కరంటు ఉంటున్నది. దీంతో ఆయిల్ ఇంజిన్ను మూలకేసిన. బండి రిపేరు చేసేటప్పుడు పవర్ టూల్స్తో పని చేస్తున్నం.
– గెద్దాడ రాము, బైక్ మెకానిక్ అండ్ సర్వీసింగ్ సెంటర్, భూపాలపల్లి
కరంటు పోతదనే రందిలేదు..
సమైక్య పాలనలో కరంటు సరిగా ఉండకపోయేది. గంటల తరబడి ఎదురుచూసేది. పనులు సరిగా జరుగకు ఇబ్బందులుపడేది. స్వరాష్ట్రంలో ఇప్పుడా ఇబ్బందిలేదు. సీఎం కేసీఆర్ 24 గంటల నిరంతర కరంటు ఇస్తున్నడు. కరెంటు వెల్డింగ్తో పాటు గ్యాస్ వెల్డింగ్ కూడా అవసరం పడుతది. ఎప్పుడు పని వచ్చినా చేస్తున్న. నాలుగు రూపాయలు వస్తున్నయ్. మునుపటి కంటే ఎక్కువ సంపాదిస్తున్న.
– వీణవంక కుమార్, రేడియేటర్ వర్క్షాపు యజమాని, భూపాలపల్లి