ఆయన ఓ రెవెన్యూ అధికారి. పని చేసింది ఏడాది కాలమే. ఆ సమయంలో దళారులతో కుమ్మక్కై ఏకంగా చెరువు శిఖం భూములు, ఎస్సారెస్పీ కాల్వ భూములకు పట్టాలు చేశాడు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు అధికారి జారీ చేసిన పట్టాలపై విచారణ జరిపిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు పేర్కొంటున్నారు.
– నల్లబెల్లి, ఏప్రిల్ 20
మండలంలోని గోవిందాపూర్ రెవెన్యూ పరిధి శంషాబాద్ గ్రామ యాపలకుంట చెరువు శిఖంలోని సర్వే నంబర్ 83లో 20 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై కొంతమంది దళారుల కన్నుపడింది. అదేవిధంగా గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 74లో తుమ్మల కుంటకు సంబంధించి 3 ఎకరాల చెరువు శిఖం భూమి ఉంది. ఈ భూమిని యాపలకుంట చెరువు శిఖం భూమిగా చిత్రీకరించారు. ఇంకేముంది సదరు అధికారి ముడుపులు తీసుకొని మామిండ్ల ఆదిరెడ్డితోపాటు మరో ఏడుగురికి యాపలకుంట చెరువు శిఖం భూముల పట్టాలు మంజూరు చేశాడు. వీరు బ్యాంకు రుణాలతోపాటు రైతుబంధు సాయం కూడా తీసుకుంటున్నారు. ఏకంగా చెరువు మధ్యలో బోరు వేశారు. ఈ వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగాయని గ్రామ రైతులు పులిగుజ్జుల బాలరాజు, వీరన్న ఆరోపిస్తున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 మేలో ఎకరాకు రూ. 4 వేల చొప్పున రైతు బంధు పంపిణీ చేసింది. ఈ జాబితాలో ఈ సర్వే నంబర్ భూములు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ తర్వాత నుంచి రైతుబంధు తీసుకుంటున్నారు.
ఎస్సారెస్పీ కాల్వ నిర్మాణం కోసం 1992-93లో అప్పటి ప్రభుత్వం మండలంలో కొంతభూమిని సేకరించింది. ప్రత్యేక జిల్లా భూసేకరణ అధికారి జీ మల్లేశం ఆధ్వర్యంలో ఆర్సీ నంబర్ ఈ-426/90 ప్రకారం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందజేశారు. కాగా, మండలంలోని బిల్యానాయక్తండా గ్రామానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి తన తండ్రి పేరున ఉన్న సర్వే నంబర్ 30లో ఎకరం 16 గుంటల భూమి, సర్వే నంబర్ 31లో 13 గుంటల భూమికి అప్పటి ప్రభుత్వ ధర ప్రకారం రూ. 32,921.50 పరిహారం చెల్లించింది. అయితే, సదరు రిటైర్డ్ ఉద్యోగి.. ఆ రెవెన్యూ అధికారితో కుమ్మక్కై ఈ భూముల సర్వే నంబర్లను మార్పించి 2019లో 1.22 ఎకరాల భూమిని సాదా బైనామా ద్వారా పట్టా చేయించుకున్నాడు. సదరు అధికారి 2018 అక్టోబర్ నుంచి 2019 నవంబర్ వరకు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆ అధికారి జారీ చేసిన పట్టాదారు పాస్పుస్తకాలపై ఉన్నతాధికారులు విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు పేర్కొంటున్నారు.
చెరువు శిఖం భూములు, ఎస్సారెస్పీ కాల్వ భూములకు అక్రమ పట్టాలు పొందిన విషయంపై విచారణ చేపడుతాం. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు. జిల్లా ఉన్నతాధికారుల సూచనలతో పట్టాలను రద్దు చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తాం.
– దూలం మంజుల, తహసీల్దార్