గిర్మాజీపేట, మార్చి 10: ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఐఈవో కాక మాధవరావు తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో 20 ప్రభుత్వ, ఏడు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నట్లు తెలిపారు. మొత్తం 27 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ప్రథమ సంవత్సరంలో జనరల్ విభాగంలో 5,612, ఒకేషనల్లో 1001 కలిసి మొత్తం 6,613 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. రెండో సంవత్సరంలో జనరల్ విభాగంలో 6,519, ఒకేషనల్లో 873 కలిపి మొత్తం 7,392 మంది హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్ష కేంద్రాలను గుర్తించడం, విద్యార్థుల కేటాయింపుతోపాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు, సిట్టింగ్ స్కాడ్స్ నియామకం వంటివి పూర్తి చేసి పరీక్షల నిర్వహణపై వారికి అవగాహన కల్పించామన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని, దూర ప్రాంతాల విద్యార్థులు ముందే సెంటర్లకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వంద శాతం సిలబస్ పూర్తి చేసి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేశామన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.