లింగాలఘనపురం, జనవరి 27 : జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిలో నెల్లుట్ల బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ నుంచి మాదారానికి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను నెల్లుట్ల బ్రిడ్జిపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.
ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మండలంలోని కుందారానికి చెందిన తొమ్మిది మందికి, దేవరుప్పుల మండలం మాదారానికి చెందిన నలుగురికి గాయాలయ్యాయి. బాధితుల్లో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉందని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.