గిర్మాజీపేట, మార్చి 12: సర్కారు బడుల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అధికారులు, ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లతో కలెక్టర్ గోపి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి, దిశానిర్దేశం చేస్తున్నారు. టెన్త్ పరీక్షల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 293 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల ఉన్నాయి. అందులో 9,728 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. పరీక్షల్లో వందశాతం ఫలితాల సాధనే లక్ష్యంగా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గత డిసెంబర్ వరకు వందశాతం సిలబస్ పూర్తి చేయగా, ప్రస్తుతం రివిజన్ క్లాసులు నిర్వహిస్తున్నది. మార్చి 15 నుంచి ప్రీ ఫైనల్-2 పరీక్షలు నిర్వహించనుంది.
పదో తరగతి విద్యార్థులకు గత నవంబర్లో ప్రభుత్వం ఎస్ఏ1 (సమ్మెటివ్ అసైన్మెంట్-సంగ్రహణాత్మక మూల్యాంకనం) పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో మార్కులకనుగుణంగా విద్యార్థులను నాలుగు కేటగిరీల్లో విభజించారు. 70 శాతం మార్కులు సాధించిన విద్యార్థులను టాప్-1, 60 శాతం పొందిన వారిని టాప్-2, 59 శాతం వస్తే యావరేజ్, 35 శాతం వచ్చిన వారిని బిలో యావరేజ్ కేటగిరీల్లో చేర్చారు. వీటిని అనుసరించి పిల్లలను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు రోజూ ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఆరు సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో సబ్జెక్టులో 5 నుంచి 20 మంది విద్యార్థులను దత్తత తీసుకొని వారి సందేహాలను సంబంధిత ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించే వార్షిక పరీక్షలకు జిల్లా నుంచి 9,728 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో 5,013 మంది బాలురు, 4,715 మంది బాలికలు ఉన్నారు. జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
10/10 జీపీఏతో వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. సబెక్టుల వారీగా వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవతో విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్థులకు సులభ పద్ధతుల్లో బోధిస్తున్నారు. మోడల్, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులే విద్యార్థులకు తగిన సూచనలు అందజేస్తూ వారికి వచ్చిన సందేహాలను నివృత్తి చేస్తున్నారు. గణితం, సైన్స్ తదితర క్లిష్టతర సబెక్టుల విషయాలను విద్యార్థులకు సులభతరం చేసేలా విద్యాబోధన చేస్తున్నారు.
ప్రతి సబ్జెక్టులో ఆయా పాఠ్యాంశాలపై వారాంతంలో విద్యార్థులకు స్లిప్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రత్యేకంగా ప్రశ్నలు రూపొందించి టెస్టులు నిర్వహిస్తున్నారు. గణితం, ఇంగ్లిష్, సైన్స్ వంటి సబ్జెక్టుల్లో విద్యార్థుల్లోని భయాన్ని పోగొట్టేందుకు ఉపాధ్యాయులంతా కలిసి కృషి చేస్తున్నారు.
పదో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అందుబాటులో ఏఎన్ఎంలను కేటాయించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లతోపాటు తాగునీటి వసతి కల్పించేందుకు సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్ గోపి వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ వారిని సమన్వయపరుస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రాన్ని శానిటేషన్ చేసేలా సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వర్కింగ్ కండీషన్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్శాఖ ద్వారా పటిష్ట బందోబస్తు నడుమ పరీక్షల నిర్వహణ ఉండాలని, ఆర్టీసీ ద్వారా అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే పరీక్షా కేంద్రాలకు ఎక్కువ బస్సులను నడుపాలని, విద్యుత్శాఖ ద్వారా పరీక్షల నిర్వహణ తేదీల్లో ఎట్టి పరిస్థితుల్లో సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులను పరీక్షలకు మానసికంగా సిద్ధం చేస్తున్నాం. భయాందోళనలకు గురకాకుండా పరీక్షలకు సన్నద్ధమైతే ఆశించిన ఫలితాలు సాధించొచ్చు. వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తున్నాం. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. – డీఈవో డీ వాసంతి