బయ్యారం, ఏప్రిల్ 10 : సమైక్య పాలనలో పల్లెలు, పట్టణాలకు అత్తెసరు నిధులే కేటాయించేవారు. అవికూడా పూర్తిస్థాయిలో అందక పనులు మధ్యలోనే ఆగిపోయేవి. ఇక్కడ కనిపిస్తున్న 108 భవనం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలోనిది.
వాహనానికి రక్షణ, సిబ్బంది కోసం 2010లో అప్పటి ప్రభుత్వం సుమారు రూ.10 లక్షలతో ఈ భవన నిర్మాణం ప్రారంభించింది. సరిపడా నిధులు అందకపోవడంతో పనులను మధ్యలోనే వదిలేశారు. దీంతో ఈ అసంపూర్తి భవనం నిరుపయోగంగా మారి పశువుల కొట్టంలా తయారైంది. ఇలా అధ్వానంగా ఉన్న భవనం స్వరాష్ట్రంలో కొత్తరూపు సంతరించుకుంది.
భవనం దుస్థితిని ఎంపీడీవో చలపతిరావు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.4లక్షల సీడీఎఫ్ నిధులు మంజూరుచేసింది. దీంతో ఆ భవనాన్ని పూర్తిచేసి రంగులు వేయడంతో ఇటీవల ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ప్రారంభించారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన భవానాన్ని 108 వాహనం రక్షణ, సిబ్బందితో పాటు ఉపాధి హామీ సిబ్బందికి కేటాయించారు.