సిటీలో పండుగలా దళితబంధు యూనిట్ల పంపిణీ
100మంది లబ్ధిదారులకు కార్లు, ట్రాక్టర్లు, డోజర్ల అందజేత
దళిత బాంధవుడు సీఎం కేసీఆర్
రాజకీయాలకతీతంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
యూనిట్లను సద్వినియోగం చేసుకుని దళితులు ఆదర్శంగా నిలువాలి
ఎంపీ పసునూరి దయాకర్
వరంగల్ ఓ సిటీలో దళితబంధు యూనిట్ల పంపిణీ గురువారం పండుగలా జరిగింది. తూర్పు నియోజకవర్గానికి చెందిన 100మందికి కార్లు, ట్రాక్టర్లు, డోజర్లు, గూడ్సు వాహనాలు అందజేయగా లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక్కడ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళిత బాంధవుడు అని, రాష్ట్రంలో రాజకీయాలకతీతంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని కొనియాడారు. యూనిట్లను సద్వినియోగం చేసుకొని దళితులు ఆదర్శంగా నిలువాలని ఎంపీ పసునూరి దయాకర్ పిలుపునిచ్చారు. తాము కోరుకున్న రంగంలో రూ.10లక్షల పెట్టుబడి పెట్టి ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారని లబ్ధిదారులు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేశారు.
పోచమ్మమైదాన్, జూన్ 23 : దళితబంధు పథకం లబ్ధిదారుల కుటుంబాల్లో పట్టరాని ఆనందం నింపుతున్నది. సీఎం కేసీఆర్ చల్లని చూపుతో తమ కుటుంబాల్లో ప్రగతి కాంతులు నిండుతున్నాయని దళిత బిడ్డలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తొలి విడుతలో భాగంగా 100 మంది లబ్ధిదారులకు వరంగల్ ఓ సిటీలో గురువారం జరిగిన కార్యక్రమంలో యూనిట్లు పంపిణీ చేశారు. కార్లు, టాక్టర్లు, గూడ్స్ వాహనాలను అందజేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. యూనిట్లు అందుకున్న సంతోషంతో లబ్ధిదారులు ఇక తమ తలరాతలు మారనున్నాయంటూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలో నూతనాధ్యాయం..
– ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధుతో దేశంలో నూతన అధ్యాయాన్ని లిఖించారు. సమైఖ్య పాలనలో దళితులపై వివక్ష కొనసాగింది. ఆ వివక్షను పారదోలడానికి, దళిత బిడ్డలు అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో రూ.10లక్షలు అందజేస్తున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయని పనిని సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారు. సీఎం అందించిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆనందమైన జీవితం గడుపుతూ మంచి విజయాలు సాధించాలి.
దేశ చరిత్రలో ఓ విప్లవం లాంటిది..
– వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్
దేశ చరిత్రలో దళితబంధు ఓ విప్లవం లాంటిది. మనసున్న సీఎం కేసీఆర్ నిరుపేద దళితుల వెతలు అర్థం చేసుకుని వారి కష్టాలను తీర్చడానికి ముందుకు వచ్చారు. ఎవరూ అడక్కుండానే దళితుల స్థితిగతులపై అధ్యయనం చేసి వారి పేదరికాన్ని నిర్మూలించడానికి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దళితబంధు అందుకున్న లబ్ధిదారులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఇతరులకు మార్గదర్శకులుగా నిలువాలి. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ తదితరులు పాల్గొన్నారు.
మా కుటుంబంలో వెలుగులు
దళితబంధుతో మా కుటుంబాల్లో వెలుగులు నిండుతయ్. నేను టెంట్ హౌస్ నడుతూ చాలీచాలనీ ఆదాయం పొందుతున్న. సీఎం కేసీఆర్ దయతో మాకు ట్రాక్టర్ డోజర్ పంపిణీ చేశారు. దీన్ని నడుపుకొంటూ ఆర్థికంగా స్థిరపడుతం. మా కుటుంబంలో చీకటి తొలిగి సంతోషం నిండే రోజులు వచ్చాయి. సీఎం కేసీఆర్ను జన్మలో మర్చిపోలేం.
– చిలువేరు పవన్ కల్యాణ్, కాశీబుగ్గ, వివేకానంద కాలనీ
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం
దళితబంధు పథకం కింద సీఎం కేసీఆర్ అందిస్తున్న సాయాన్ని ఈ జన్మలో మరిచిపోలేం. ఆయనకు మేమంతా రుణపడి ఉంటం. ప్రైవేట్ డ్రైవర్గా పనిచేసిన నేను ఇప్పుడు కారు ఓనరునైన. కష్టపడి సంపాదించి మా కుటుంబాన్ని బాగా చూసుకుంట. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నయ్.
– ఇసంపల్లి సదానందం, కొత్తవాడ
సీఎం కేసీఆర్ ఇచ్చిన వరం
దళితబంధు పథకం సీఎం కేసీఆర్ ఇచ్చిన వరం. నేను ఇప్పుడు కారు ఓనరునైన. మాకు జీవనోపాధి దొరికింది. ఇతరులపై ఆధారపడకుండా నా కాళ్లపై నేను నిలబడుతా. కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా జీవిస్తా.
– రమేశ్, వరంగల్
సంతోషంగా బతుకుతాం
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు మా కుటుంబాలకు ఎంతో ఆధారంగా నిలిచింది. ట్రాక్టర్తో నిత్యం సంపాదిస్తూ సంతోషంగా బతుకుతామనే ధీమా ఏర్పడింది. చిన్నచిన్న పనులు చేసుకునే నాకు చేతినిండా పని చేసుకునే అవకాశం కలిగింది. సీఎం కేసీఆర్కు మేమంతా రుణపడి ఉంటం.
– వేణు, కరీమాబాద్