పోచమ్మమైదాన్, మార్చి 24: లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఎటుచూసినా పెద్దపెద్ద అక్షరాలతో కనిపించే బోర్డులు. అయినా ఏదో ఒకచోట గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు చేస్తూనే ఉన్నారు. ఇందులో వరంగల్ దేశాయిపేటలోని నజ్రత్పురను ఎంచుకున్న కొంతమంది వైద్య సిబ్బంది ప్రభుత్వ అనుమతి లేకుండానే మూడు నెలల నుంచి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. తాజాగా శనివారం రాత్రి పోలీసులు దాడులు చేసి వారిని పట్టుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. 13వ డివిజన్లోని నజ్రత్పుర ప్రాంతం అంటే అంతగా ఎవరికీ తెలియదు. ఇక్కడ నామమాత్రంగా ఉన్న ఇండ్లల్లో తక్కువ జనాభా ఉంది. చాలామంది పేదలు ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంచుకున్న కొంతమంది వైద్య సిబ్బంది ఎవరికీ అనుమానం రాకుండా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. హంటర్ రోడ్డుకు చెందిన ఓ డాక్టర్, కాశీబుగ్గకు చెందిన ఓ నర్సుతోపాటు మరికొంతమంది సిబ్బంది ఈ దందాకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాంతంలో అద్దెకు తీసుకున్న గదిలో ఏం జరుగుతుందో కూడా స్థానికులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. మొబైల్ స్కానింగ్ మిషన్ మాత్రమే తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు చేస్తున్నారు.
నజ్రత్పురలోని ఓ ఇరుకుగదిలో ఏర్పాటు చేసిన స్కానింగ్ సెంటర్ ఎవరికీ సరిగా కనిపించదు. సెల్ఫోన్లతో కాల్ చేసి ఆటోల్లో తీసుకొచ్చి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. హనుమకొండలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని, ఈ కేంద్రానికి వారిని తరలిస్తున్నట్లు తెలుస్తున్నది. వీరిని తీసుకొచ్చేందుకు ఆటో డ్రైవర్కు రోజుకు రూ. 3 వేలు ఇస్తున్నట్లు తెలిసింది. నిత్యం కనీసం పది మందికి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ ఒక్కొక్కరి నుంచి రూ. 15 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
నజ్రత్పురలో కొనసాగుతున్న లింగనిర్ధారణ పరీక్షల వ్యవహారం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి పోలీసులకు సమాచారం వెళ్లింది. దీంతో పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి, మొబైల్ స్కానింగ్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, పరీక్షలు చేస్తున్న వైద్యురాలితోపాటు నర్సును అదుపులో తీసుకున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వైద్యురాలితోపాటు నర్సుపై ఇంతెజార్గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.