వరంగల్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): కుల వృత్తుల ఆర్థిక పరిపుష్ఠికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వివిధ పథకాలు అమలు చేస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా మత్స్యకారులకు ప్రతి ఏటా పూర్తి సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. ఈ సంవత్సరం వరంగల్ జిల్లాకు 1.94కోట్ల చేప పిల్లలను కేటాయించింది. సర్కారు ఆదేశంతో త్వరలో జిల్లాలోని 703 చెరువుల్లో రూ.2 కోట్ల విలువైన చేప పిల్లల విడుదలకు మత్స్య శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తవగా, శనివారం రాయపర్తి చెరువులో చేప పిల్లలను వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా పంపిణీ పూర్తి చేస్తామని చెబుతున్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో గొల్లకుర్మలు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, నాయీబ్రాహ్మణులు, రజకులు తదితరుల కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. మత్స్యకారులకు ఏటా వంద శాతం సబ్సిడీపై (ఉచితంగా) చేప పిల్లలను సరఫరా చేస్తోంది. వానకాలంలో మత్స్యకారులతో కలిసి అధికారులు ఉచిత చేప పిల్లలను చెరువుల్లో పోస్తున్నారు. పెరిగిన తర్వాత మత్స్యకారులు పట్టి అమ్ముకొని ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో చేపల సంపద క్రమంగా పెరుగుతున్నది. చేపలను దిగుమతి నుంచి ఎగుమతి చేసే దిశగా మత్స్యకారులు ఎదుగుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా జిల్లాలో ఉచిత చేపపిల్లల పంపిణీ ప్రక్రియను చేపట్టింది. మత్స్యశాఖ అధికారులు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి చేప పిల్లల సరఫరా ప్రారంభించారు. జిల్లాలో రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్, సంగెం, నర్సంపేట మండలాల్లోని ఎల్గూరురంగంపేట, మాదన్నపేట వంటి పెద్ద చెరువులు సహా 703 చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో 184 మత్స్య సహకార సంఘాలు పని చేస్తున్నాయి. ఈ సంఘాల్లో ప్రత్యేకంగా 40 మహిళా మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. మొత్తం 184 సంఘాల్లో 14,650 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.2కోట్ల విలువైన చేపపిల్లలను ఉచితంగా అందజేస్తున్నది. ఈ ఏడాది కూడా అంతే విలువైన 1.94 కోట్ల చేప పిల్లలను సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావటంతో ఇటీవల మత్స్యశాఖ అధికారులు చేప పిల్లల సరఫరా కోసం టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని మైలారం రిజర్వాయర్, పెద్ద చెరువులతోపాటు ఇతర చెరువుల్లో విడుదల చేసే చేప పిల్లలను సరఫరా చేసే టెండర్లను నలుగురు కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. వీరిలో వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన చేపపిల్లల కాంట్రాక్టర్లు బైరి హరినాథ్, బయ్య బుచ్చిబాబు, సంగాని సూరయ్య, ఇందూర్ ఫిష్ సీడ్ ఫామ్ యజమాని ఉన్నట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం మత్స్యశాఖతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు 1.94కోట్ల చేప పిల్లలను సరఫరా చేసేందుకు రంగంలోకి దిగారు.
ప్రారంభమైన చేపపిల్లల పంపిణీ
భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని చెరువులన్నీ నిండిపోయాయి. ఎస్సారెస్పీ కాలువల ద్వారా చెరువుల్లోకి కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని సరఫరా చేయడం మొదలైంది. దీంతో మైలారం రిజర్వాయర్ సహా జిల్లాలోని 703 చెరువుల్లో ఉచిత చేప పిల్లలను విడుదల చేయడానికి మత్స్యశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. కొద్దిరోజుల క్రితం కలెక్టర్ పి.ప్రావీణ్య మత్స్యశాఖ అధికారులతో టెండర్ల ప్రక్రియ, చేపపిల్లల పంపిణీ ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయా చెరువుల్లో ఉచిత చేప పిల్లలను విడుదల చేయడానికి ముందు స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యసహకార సంఘాలకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఈ మేరకు మత్స్యశాఖ అధికారులు జిల్లాలోని చెరువుల్లో ఉచిత చేపపిల్లల పంపిణీని శనివారం ప్రారంభించారు. రాయపర్తి మండల కేంద్రంలోని మంచినీళ్ల చెరువులో తొలిరోజు మత్స్య సహకార సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి 17,400 ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. మైలారం రిజర్వాయర్తోపాటు ఎల్గూరురంగంపేట, మాదన్నపేట చెరువులతోపాటు వర్ధన్నపేట మండలంలోని కోనారెడ్డి, దమ్మన్నపేట పెద్దచెరువు, నల్లబెల్లి పెద్దచెరువు, రాయపర్తి మండల కేంద్రంలోని రామచంద్రునిచెరువు, చెన్నారావుపేట మండలంలోని అక్కల్చెడ పెద్ద చెరువు, చెన్నారావుపేట పెద్దచెరువుతో పాటు మరో పెద్ద చెరువులో పెద్ద సైజు ఉచిత చేపపిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు ప్లాన్ చేశారు. ఈ పదింటిలో 36.48లక్షల బొచ్చె, రొహు, మెరిగె రకాలు పెద్ద సైజు చేప పిల్లలను వదలనున్నట్లు మత్సశాఖ జిల్లా అధికారి నరేశ్కుమార్నాయుడు వెల్లడించారు. మిగతా 693 చెరువుల్లో 1,57,52,000 చిన్న సైజు చేప పిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. సెప్టెంబర్ మొదటివారంలోగా జిల్లాలోని మైలారం రిజర్వాయర్ సహా 703 చెరువుల్లో ఉచిత చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
నాలుగింటిలో రొయ్యలకు ప్రతిపాదన
మైలారం రిజర్వాయర్తోపాటు ఎల్గూరురంగంపేట, మాదన్నపేట, దమ్మన్నపేటలోని పెద్దచెరువులో వంద శాతం సబ్సిడీతో కూడిన ఉచిత రొయ్య పిల్లలను వదిలేందుకు మత్సశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. గత ఏడాది సీడ్ అందుబాటులో లేకపోవటంతో జిల్లాలో మైలారం రిజర్వాయర్లో మాత్రమే ఉచిత రొయ్య పిల్లలను వదిలింది. ఈ ఏడాది మైలారం రిజర్వాయర్ సహా నాలుగు చెరువుల్లో 10.50లక్షల నీలకంఠ రొయ్య పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు ప్రతిపాదించారు. త్వరలోనే ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి ఆమోదం లబించే అవకాశం ఉంది.