వరంగల్, మార్చి 23(నమస్తేతెలంగాణ) : టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమ నిర్మాణానికి టీఆర్ఎస్ నాయకులు సన్నద్ధం అవుతున్నారు. ఏటా రైతులు పండించే రెండు పంటల వడ్లను కొనాలనే డిమాండ్తో పోరాడేందుకు నడుం కడుతున్నారు. గురువారం నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పంజాబ్ తరహా కేంద్రం సేకరించాలనే డిమాండ్తో తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమావేశం ముగిశాక మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. నిరసన కార్యక్రమాల నిర్వహణకు నియోజకవర్గం వారీగా ఇన్చార్జిలను నియమించారు. నర్సంపేట ఇన్చార్జిగా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, వర్ధన్నపేట ఇన్చార్జిగా ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, పరకాల ఇన్చార్జిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పాలకుర్తికి మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు నియమితులైనట్లు వెల్లడించారు. ఇన్చార్జిలు ఈ నెల 24న నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. 26న గ్రామ పంచాయతీలు, 27న మండల పరిషత్లు, 30న జిల్లా పరిషత్లు తీర్మానాలు చేయాలన్నారు. గురువారం నర్సంపేట నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నర్సంపేటలోని సిటిజన్ క్లబ్లో జరుగనుంది. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, నిరసన కార్యక్రమాల నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర జ్యోతి పాల్గొంటారు. వరంగల్తూర్పు సమావేశం స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో కరీమాబాద్లోని రామ్లక్ష్మణ్ గార్డెన్లో జరుగనుంది. వర్ధన్నపేట నియోజకవర్గ సమావేశం హనుమకొండ హంటర్రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్లో జరుగనుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రకటించారు. ఆయనతో పాటు ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావు పాల్గొంటారు. సమావేశాలకు మున్సిపల్ చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, సింగిల్విండోల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ మండల, పట్టణ, డివిజన్, వార్డు, గ్రామ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ ముఖ్యనేతలు హాజరు కానున్నారు. మంత్రి ఎర్రబెల్లి శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకుర్తిలో జరిగే సమావేశానికి రాయపర్తి మండలం నుంచి ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొంటారు.