కమలాపూర్ మండలం అంబాలలో టీఆర్ఎస్కే మద్దతు తెలుపుతున్నట్లు యాదవుల తీర్మానం
కమలాపూర్, జూలై 31 : దేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏ ప్రభుత్వం కూడా గొల్ల, కురుమలకు పథకాలు అందించలేదని, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధికి బాటలుపడ్డాయని యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి, ఓయూ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాంయాదవ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం అంబాలలో యాదవులంతా టీఆర్ఎస్కే మద్దతు తెలిపి తీర్మానం చేసినట్లు చెప్పారు. అంబాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గొల్ల, కురుమలకు టీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ, రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మి తదితర పథకాలు అందించి అండగా నిలిచిందన్నారు. యాదవుల అభివృద్ధికి కృషి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. అఖిల భారత యాదవ మహాసభ గ్రామ అధ్యక్షుడు బోయిని చంద్రమౌళితోపాటు కమిటీ సభ్యులు టీఆర్ఎస్కే మద్దతు ఇస్తున్నట్లు తీర్మాన పత్రాన్ని తనకు అందించినట్లు వివరించారు. కార్యక్రమంలో యాదవ కులస్తులు భిక్షపతి, కొంరయ్య, సమ్మయ్య, కిషన్, మొగిలి తదితరులున్నారు.