హనుమకొండ, డిసెంబర్ 30 ; ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి మా సహకారం తప్పకుండా ఉంటుంది. కాంగ్రెస్ చెప్పిన మేరకు ఆరు గ్యారెంటీలను వందరోజుల్లో అమలు చేయాలి.. ఆ తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం, గ్యారెంటీల అమలుపై మా పోరాటం ఉంటుంది’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ దయాకర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి, శంకర్నాయక్తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.
కోట్లాది మంది తరలివచ్చే సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హనుమకొండలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ అందరూ కొంగు బంగారంలా కొలిచే మేడారం జాతర వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉండడం గర్వకారణమన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం గడిచిన పదేళ్లలో మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. జాతరను నాటి ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మొదటి సారి జాతరలో భక్తులకు వసతులు కల్పించేందుకు రూ. 100 కోట్లు కేటాయించిందని, ఆ తర్వాత వరుసగా రూ.75కోట్ల చొప్పున కేటాయిస్తూ ఘనంగా జాతర జరిగేలా చూసిందని చెప్పారు. బీఆర్ఎస్, కేసీఆర్ కృషితోనే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ చొరవతో ట్రైబల్ యూనివర్సిటీ రాష్ర్టానికి రావడం సంతోషకరమని, ఇందుకోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లు వెచ్చించి యూనివర్సిటీకి కావాల్సిన భూములను సమకూర్చిందని, రూ.850కోట్లతో ఇప్పుడు యూనివర్సిటీ నిర్మాణం చేపట్టడం గర్వకారణమన్నారు.
మనోధైర్యం కోల్పోవద్దు
ఉద్యమగడ్డగా పేరుగాంచి, ఇన్నేళ్లూ బీఆర్ఎస్ వెంట ఉన్న వరంగల్ ప్రజలు, ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని, అందుకే అనుకున్న ఫలితాలు రాలేదని, పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని, మళ్లీ మంచి రోజులు వస్తాయని, అప్పటి వరకు ధైర్యంతో పార్టీ సిద్ధాంతాల మేరకు ముందుకు సాగాలని కవిత పిలుపునిచ్చారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అమలు సాధ్యంకాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. గతంలో 44 లక్షల మందికి పింఛన్లు వచ్చేవని, ఇప్పుడు గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణ పెట్టి డిసెంబర్, జనవరిలో పెన్షన్లు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ రైతుబంధు కూడా రాలేదన్నారు. తాము ఎకడికెళ్లినా పెన్షన్, రైతుబంధు రానివారు బాధపడుతూ చెబుతున్నారన్నారు. ప్రజా పాలన దరఖాస్తుల్లో స్పష్టత లేదన్నారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారు బిల్లు కట్టడం అవసరం లేదని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారని, జనవరిలో బిల్లు కట్టాలా వద్దా అనేది స్పష్టత లేదన్నారు. దరఖాస్తులో కేవలం ఐదు పథకాలకు సంబంధించిన కాలమ్స్ మాత్రమే ఉన్నాయని, నిరుద్యోగ భృతి గురించి ఫాంలో లేదన్నారు. ఎఫ్ఐఆర్ ఉన్న ఉద్యమకారులు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారని, ఎఫ్ఐఆర్ లేకుండా ఉద్యమాలు చేసిన వారి పరిస్థితి ఏమిటిని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఎలాంటి కష్టాలు ఉండేవో ఇపుడు మళ్లీ అవే కష్టాలు మొదలయ్యాయన్నారు. మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, సుందర్ రాజు యాదవ్, తెలంగాణ జాగృతి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్ భాసర్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బీఆర్ఎస్ కన్వీనర్ జనార్దన్ గౌడ్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, జాగృతి విభాగం నాయకులు పాల్గొన్నారు.
దళితబంధు ఇప్పించాలని వినతి
దళితబంధు రెండో విడుతలో ములుగు జిల్లా నుంచి ఎంపిక చేసిన 1100మందికి పథకాన్ని ఇప్పించాలని కోరుతూ ఎమ్మెల్సీ కవితకు దళితులు వినతిపత్రం సమర్పించారు. మూడు నెలల క్రితం తమను లబ్ధిదారులుగా ఎంపిక చేసి జాబితా విడుదల చేశారని, ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులు కాలయాపన చేస్తూ తమకు పథకం వర్తింపజేయకుండా చేస్తున్నారని వాపోయారు. తమ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.
తల్లులకు పూజలు
ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం మధ్యాహ్నం ములుగు జిల్లాలోని ఆదిదేవత గట్టమ్మను, మేడారంలో సమక్క, సారక్కను దర్శించుకున్నారు. ముందుగా ఆమెకు గట్టమ్మ వద్ద ములుగు జడ్పీచైర్పర్సన్ బడే నాగజ్యోతి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ మాలోత్ కవిత పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. అనంతరం మేడారంలో సమ్మక్క, సారలమ్మ దర్శనానికి రాగా వారికి పూజారులు, దేవాదాయశాఖ అధికారులు డోలివాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికి తల్లుల గద్దెల వద్దకు తీసుకువెళ్లారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలపై పసుపు, కుంకుమ, బెల్లం, నూతన వస్ర్తాలను సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు వారికి అమ్మవారి వస్ర్తాలు, ప్రసాదాన్ని అందజేశారు.
ఎమ్మెల్సీ కవిత వెంట దాస్యం వినయ్భాస్కర్, బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్యాదవ్, జడ్పీటీసీ గై రుద్రమదేవి, భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పోరిక రవీందర్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చెన్న విజయ్ తదితరులున్నారు.