శాయంపేట, ఆగస్టు 1: మండలంలోని కొప్పుల గ్రామంలో భర్త ఇంటి ఎదుట భార్య మౌన దీక్ష చేపట్టిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన కొలిపాక హర్షితను అదే గ్రామానికి చెందిన సామల వేణుమాధవ్తో గతేడాది ఆగస్టు 5న వివాహం జరిపించారు. ఈ సందర్భంగా బంగారం, నగదుతో పాటు ఎకరం పదహారు గుంటల భూమిని కట్నకానుకలుగా అందజేశారు. కాగా, వేణుమాధవ్ వివాహానికి ముందు నుంచే హన్మకొండలో ఓ చిడ్ఫం డ్ నిర్వహిస్తూ అందులో పనిచేసే మహిళతో వివాహేతర సం బంధం పెట్టుకున్నాడని, దీంతో తనతో కాపురం చేయడంలేదని హర్షిత తెలిపింది.చిట్ఫండ్లో నష్టాలు రావడంతో పుట్టిం టి నుంచి రూ. 20లక్షలు తేవాలని భర్తతో పాటు, అత్త, మామ వేధింపులు ప్రారంభించారు. దీంతో హర్షిత రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. ఐదు సార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ చేసినా ఫలితం లేదని, విడాకుల నోటీసు పంపించాడని, దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఆదివారం భర్త వేనుమాధవ్ ఇంటి ఎదుట మౌన దీక్ష చేపట్టింది. విషయం తెలుసుకున్న పీఎస్ఐ సుమలత బాధితురాలితో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
నెల్లికుదురు మండలంలో..
మహబూబాబాద్ రూరల్ : నెల్లికుదురు మండలం వావిలాల గ్రామానికి చెందిన మలంగూరు అంజయ్య-రామతార దంపతుల కూతురు అశ్వినిని 10 నెలల క్రితం మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన బాసంపల్లి యాకస్వామి-పద్మ కుమారుడు అఖిల్తో వివాహం జరిపారు. ఈ సందర్భంగా రూ.4లక్షలను కట్నంగా ఇచ్చారు. కాగా, పెళ్లయిన ఐదు రోజుల నుంచే అశ్విని తనకు ఇష్టం లేదని చెప్పి వేధిస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు. ఐదు నెలల తర్వాత తల్లిదండ్రుల వద్దకు పంపించి, మళ్లీ కాపురానికి తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ చేసిన ఫలితం లేదని సదరు మహిళ తల్లిదండ్రులు తెలిపారు. ఆదివారం అశ్విని, కుటుంబ సభ్యులు అఖిల్ ఇంటి ఎదుట ధర్నా చేశారు. తమ కూతురుకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.