గీసుగొండ, అక్టోబర్ 26: పల్లెప్రగతిలో చేయాల్సిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీఆర్డీవో సంపత్రావు సూచించారు. మండలంలోని రాంపురం, మనుగొండ, గీసుగొండ, గంగదేవిపల్లి, ఆరెపల్లిలో మంగళవారం అయన పర్యటించారు. డంపింగ్ యార్డుల్లో వర్మికంపోస్టు ఎరువు తయారు చేయాలన్నారు. అలసత్వం ప్రదర్శించకుండా శ్మశాన వాటిక పనులను పూర్తి చేయాలని సూచించారు. ఉపాధిహామీ పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రతి గ్రామంలో కనీసం 50 మంది కూలీలతో ఉపాధి పనులు చేయించాలన్నారు. కార్యదర్శులు కూలీల్లో చైతన్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు దౌడు బాబు, గోనె మల్లారెడ్డి, జ్యోతి, గోపి, నమిండ్ల రమ, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో ప్రభాకర్ పాల్గొన్నారు.
‘పల్లెప్రగతి’లో వేగం పెంచాలి
నర్సంపేట రూరల్: పల్లెప్రగతి పనుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు వేగం పెంచాలని డీఎల్పీవో వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని ముగ్ధుంపురంలో నర్సరీ, పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక పనుల పురోగతిని డీఎల్పీవో పరిశీలించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం జీపీ రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని గ్రామ పంచాయతీ పాలకులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పెండ్యాల జ్యోతి, ఉప సర్పంచ్ సీహెచ్ తిరుపతినాయక్, కార్యదర్శి రహీం పాషా, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే, ఎంపీడీవో అజ్మీరా నాగేశ్వరరావు గుంటూరుపల్లి, చిన్నగురిజాల, గురిజాలలోని నర్సరీలను పరిశీలించారు. ప్రజలు మొక్కల పెంపకాన్ని బాధ్యతగా చేపట్టాలని కోరారు. అనంతరం జీపీలో లేబర్ బడ్జెట్, జీపీకి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్లు పార్వతమ్మ, గడ్డం సుజాత, గొడశాల మమత, కార్యదర్శులు, కారోబార్లు ఉన్నారు.
ప్రతి గ్రామంలో పనులు కల్పించాలి
ఖానాపురం: ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో 30 మందికి తగ్గకుండా కూలీలకు పనులు కల్పించాలని ఏపీడీ సాయిచరణ్ అన్నారు. రంగాపురం, కొత్తూరులో ఆయన ఉపాధి పనులు, నర్సరీలను పరిశీలించారు. పనులు గుర్తించి కూలీలకు అధిక పనిదినాలు కల్పించాలన్నారు. వచ్చే హరితహారం నాటికి ఇప్పటి నుంచే నర్సరీలను సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట సుధాకర్, కార్యదర్శి సోని ఉన్నారు.