పారిశుధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామాల్లో రోడ్లు చిత్తడిగా మారడంతో పాటు చెత్త పేరుకుపోయింది. అంతేకాకుండా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరదలతో పలు గ్రామాలు నీటమునిగి బురదమయమయ్యాయి. దీంతో ఆయా పంచాయతీల్లో జిల్లా అధికారులు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కార్యదర్శితో పాటు పంచాయతీ సిబ్బందిని గూగుల్ యాప్కు అనుసంధానం చేసి పనుల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. మురుగు కాల్వలు, నీరునిల్వ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వేసి, కిరోసిన్ పిచికారీ చేస్తున్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను నమోదు చేస్తున్నారు. వారు పని చేస్తున్న ప్రదేశం నుంచి స్మార్ట్ ఫోన్ ద్వారా ఫొటో తీసి గూగుల్ యాప్ లింక్లో అప్లోడ్ చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి, జూలై 25 (నమస్తే తెలంగాణ) : ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో జిల్లా అధికారులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని గ్రామపంచాయతీల తోపాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. ఆయా జీపీల సిబ్బందితో పాటు అవసరమైన చోట మరికొంత మందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించి పారిశుధ్య పనులు నిరంతరాయంగా చేపడుతున్నారు. కార్యదర్శితో పాటు పంచాయతీ సిబ్బందిని గూగుల్ యాప్కు అనుసంధానం చేసి, వారు చేస్తున్న పనులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నారు.
విస్తృతంగా అయిల్ బాల్స్, బ్లీచింగ్
ఈగలు, దోమలు వాలకుండా, దుర్వాసన రాకుం డా అధికారులు ప్రతి వాడలో విరివిగా బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నారు. పరిసరాలను శుభ్రం చేస్తూ మురుగు కాల్వలు, నీరు నిల్వ ఉన్న లోతట్టు ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వేసి, కిరోసిన్ను పిచికారీ చేస్తున్నారు. మంచినీటి ట్యాంకులు, బావులు, ఇతర తాగు నీటికి, కుటుం బ అవసరాలకు వినియోగించే నీటిలో క్లోరినేషన్ ప్రక్రియ చేపడుతున్నారు. నీరు కలుషితమై వివిధ రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన చోట ఈ ప్రక్రియై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దోమల నివారణకు ఫాగింగ్ను చేపడుతున్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను నమోదు చేస్తున్నారు. కుటుంబంలో ఎవరికైనా జ్వరం ఉంటే సమాచారం ఇస్తున్నారు.
ముంపు ప్రాంతాల్లో..
గోదావరి నది ఉప్పొంగి ప్రవహించిన మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం, కాటారం మండలాల్లో అధికారులు పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఎవరు ఎక్కడ పని చేస్తున్నారు? అనే విషయాలను గుర్తించేందుకు వారిని గూగుల్ యాప్కు అనుసంధానం చేశారు. పని చేస్తున్న ప్రదేశం నుంచి స్మార్ట్ ఫోన్ ద్వారా ఫొటో తీసి గూగుల్ యాప్ లింక్లో అప్లోడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధుల్లో ఉండేలా చర్యలు చేపట్టారు.
పరిసరాలు శుభ్రంగా ఉంచేలా చర్యలు
భారీ వర్షాల నేనథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా పరిసరాలు శుభ్రం చేయిస్తున్నాం. సిబ్బందికి సూచనలు చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.
– ఆశాలత, డీపీవో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా