హనుమకొండ, మార్చి 13 : గ్రామ పరిపాలనలో కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు పన్నుల వసూళ్లు పూర్తి చేయాల్సిన గడువు దగ్గరపడుతుండగా, మరోవైపు ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ప డింది. దీంతో రెండింటినీ సమాంతరంగా ని ర్వహించడం కష్టమవుతున్నదని వాపోతున్నా రు. నెలాఖరులోగా పన్నుల వసూలు వంద శాతం పూర్తి చేయాల్సిందేనని పంచాయతీ రాజ్ కమిషనర్తో పాటు జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో కార్యదర్శులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెలలో ఇంకా కేవలం 17 రోజులు మాత్రమే మిగిలి ఉన్నా యి. ఇదే సమయంలో సర్వేలు, సమావేశా లు, నివేదికలు, ఫీల్డ్ సందర్శనలు, డేటా సేకరణ నిర్వహించాల్సి రావడంతో పని భారం పెరిగిందని పలువురు కార్యదర్శులు అంటున్నారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’తో రోజువారీ పనులకు ఆటంకం కలుగుతున్నదని చెబుతున్నారు. సాధారణంగా ప్రజలకు అందించాల్సిన ధ్రువీకరణ పత్రాలు, పథకాల అమలు, రికార్డుల నిర్వహణ వంటి పనులు కూడా ఆలస్యమవుతున్నాయంటున్నారు.
ఈ క్రమంలో పన్నుల వసూలు కోసం గ్రామం లో తిరిగే సమయం దొరకడం లేదని వాపోతున్నారు. వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమంటున్నారు. ప్రజా పాలనలో నిర్వహిస్తున్న పనులన్నీ ప్రతి రోజు విధుల్లో భాగంగా చేసేవేనని, కొత్తగా ఏమీ లేవని, అయినప్పటికీ ఇప్పుడు వాటిని ప్రత్యేక కార్యక్రమం పేరుతో చేయాల్సి వస్తున్నదంటున్నారు. దీనివల్ల అసలు పనులు పక్కకు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పన్నుల వసూ లు సులభంగా లేదని, ఇందుకోసం ఎంతో కష్టపడాల్సి వస్తున్నదంటున్నా రు.
అంతేకాక అవసరమైన సిబ్బంది లేకపోవడం, వనరుల కొరత, సాంకేతిక సమస్యలు కూడా తమ పనిని మరింత క్లిష్టం చేస్తున్నాయని కార్యదర్శులు వాపోతున్నారు. మొ త్తంగా చూస్తే కార్యదర్శులు ప్రస్తుతం ‘డబుల్.. ట్రబుల్’ పరిస్థితిని ఎదురొంటున్నా రు. ప్రభుత్వ లక్ష్యాలు ఒకవైపు, ప్రజల అంచనాలు మరోవైపు ఉండగా, పరిమిత సిబ్బందితో అన్ని బాధ్యతలను నిర్వర్తించడం వారికి సవాల్గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలను మభ్య పెట్టేందుకే..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ ప్రజలను మభ్యపెట్టేందుకేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే ఈ కార్యక్రమాన్ని విమర్శించడం గమనార్హం. ప్రతిరోజు గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో చేస్తున్న పనులనే కొత్త పేరుతో చేయించడమనేది తాము అభివృద్ధి చేస్తున్నామని ప్రజలను నమ్మబలికించడానికేనని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రతి మంగళ, శుక్రవారం డ్రై డేగా అమలు చేస్తున్నారని, ప్రస్తుతం ఆ రోజుల్లో అవే పనులు చేయడంలో కొత్తదనమేముందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాక ఈ కార్యక్రమంపై కొందరు అధికారులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, పన్నులా? ప్రణాళికా? అనే సందిగ్ధంలో పంచాయతీ కార్యదర్శులు చికుకుపోయారు. మిగిలిన 17 రోజుల్లో లక్ష్యాన్ని చేరుకుంటారా? లేదా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మిగిలింది. అలాగే లక్ష్యం మేరకు పన్నులు వసూలు చేయకపోతే పై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు.