గ్రూప్-4 పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ సారి ఎలాగైనా జాబ్ కొట్టాలనే ఆశతో వేలాదిగా అభ్యర్థులు ఉత్సాహంగా తరలివచ్చారు. హనుమకొండ జిల్లాలో ఫస్ట్ పేపర్కు 81.83శాతం, సెకండ్ పేపర్కు 81.36 శాతం, వరంగల్ జిల్లాలో 80.77శాతం, 80.43 శాతం మంది హాజరయ్యారు. లక్నేపల్లి బిట్స్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ పీ ప్రావీణ్య తనిఖీ చేశారు. హనుమకొండలోని సెయింట్ పీటర్స్ హైసూల్, గీతాంజలి డిగ్రీ కాలేజీలోని సెంటర్లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. ఎక్సామ్ నిర్వహిస్తున్న సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధించారు.
వరంగల్, జూలై 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఖిలావరంగల్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-4 పరీక్ష వరంగల్, హనుమకొండ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థుల సందడితో అన్ని సెంటర్ల వద్ద జాతరను తలపించింది. హనుమకొండ జిల్లాలోని అన్ని సెంటర్లలో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. యువత ఉత్సాహంగా పరీక్ష రాశారు. గ్రూప్-4 పరీక్ష కోసం హనుమకొండ జిల్లాలో 47,973 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. మొదటి విభాగంలో 39,255 మంది హాజరయ్యారు. రెండో విభాగంలో 39,031 మంది పరీక్ష రాశారు. ఫస్ట్ పేపెర్లో 81.83 శాతం, సెకండ్ పేపెర్లో 81.36 శాతం హాజరు నమోదైంది. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. సెయింట్ పీటర్స్ హైసూల్, గీతాంజలి డిగ్రీ కాలేజీలో సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లోని గదులను తనిఖీ చేశారు. అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను గమనించి అధికారులకు సూచనలు చేశారు.
వరంగల్ జిల్లాలో గ్రూప్-4 పరీక్షలు సంపూర్ణంగా ముగిశాయి. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా 76 పరీక్ష కేంద్రాల్లోని ప్రధాన ద్వారం వద్ద అభ్యర్థులను పోలీసులు క్షణ్ణంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల నుంచి 300 మీటర్ల వరకు జిరాక్స్ సెంటర్లను మూసి వేసి 144 సెక్షన్ను అమలు చేశారు. మొదటి పేపర్కు 29,819 మందికి 24,084 మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. రెండో పేపర్కు 23,984 మందికి 5,835 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బిట్స్ కళాశాలలోని ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ పీ ప్రావీణ్య తనిఖీ చేశారు. జిల్లాలో గ్రూప్-4 పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరుగడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
ఎల్కతుర్తి/కమలాపూర్/ధర్మసాగర్: హనుమకొండ జిల్లాలోని మండలకేంద్రాల్లోనూ గ్రూప్-4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎల్కతుర్తిలోని సోషల్ వెల్ఫేర్, మోడల్ స్కూల్, కార్మెల్ పాఠశాలలో అధికారులు పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. కమలాపూర్ బాలికల పాఠశాల, బాలుర పాఠశాల, ఎంజేపీ బాలుర విద్యాలయం, మోడల్ స్కూల్లో పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించినట్లు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, సీఐ సంజీవ్ తెలిపారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను వెనక్కి పంపించారు. ధర్మసాగర్లోని జడ్పీఎస్ఎస్ బాలుర, కరుణాపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులంలో పరీక్షలు నిర్వహించారు.
నర్సంపేటరూరల్/నర్సంపేట/ఖానాపురం/చెన్నారావుపేట/కరీమాబాద్, జూలై 1: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి, మహేశ్వరం, ముగ్దుంపురంలో ఏర్పాటు చేసిన ఏడు కేంద్రాల్లో గ్రూప్-1 పరీక్ష సజావుగా జరిగింది. అధికారులు అభ్యర్థులను తనిఖీ చేసిన అనంతరం సెంటర్లోకి అనుమతించారు. లక్నేపల్లి, ముగ్దుంపురం, మహేశ్వరంలోని బిట్స్, శివానీ, జయముఖి ఇంజినీరింగ్ కళాశాలలో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించలేదు. దీంతో సుమారు 12 మంది అభ్యర్థులు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. బిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ఆమె సూచనలు చేశారు. అదేవిధంగా ఈస్ట్జోన్ డీసీపీ కరుణాకర్, క్రైం డీసీపీ దాసరి మురళీధర్, నర్సంపేట ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ సంపత్రావు కూడా ఎగ్జామ్ సెంటర్లను తనిఖీ చేశారు. అలాగే, నర్సంపేటలో పరీక్ష కేంద్రాలను డీసీపీ కరుణాకర్, ఏసీపీ సంపత్రావు, సీఐ పులి రమేశ్ సందర్శించారు. పరీక్ష సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధించి అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారు. ఖానాపురం మండలం బుధరావుపేట మోడల్స్కూల్లో గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 432 మందికి 316 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇద్దరు ఆలస్యంగా రావడంతో వెనక్కి పంపించారు. చెన్నారావుపేట మండలం అమీనాబాద్ మోడల్ స్కూల్లో రెండు పేపర్లను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు సెంటర్ అధికారి ప్రసన్నలక్ష్మి తెలిపారు. కరీమాబాద్ ఉర్సులోని తాళ్ల పద్మావతి కళాశాల ప్రాంతంలో అభ్యర్థులకు బీఆర్ఎస్ నాయకులు ఉచితంగా భోజన సదుపాయం కల్పించారు. కార్పొరేటర్ ఎం అరుణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముష్కమల్ల సుధాకర్, కట్కూరి రాజేశ్ పాల్గొన్నారు.
హనుమకొండచౌరస్తా: గతం కంటే ఈసారి గ్రూప్-4 పరీక్ష బాగా రాశా. జాబ్ వస్తుందనే నమ్మకం ఉంది. రెండు పేపర్లు ఈజీగానే వచ్చాయి. సెంటర్లలో ఏర్పాట్లు కూడా బాగానే చేశారు. వరంగల్కు సంబంధించిన ప్రశ్న, బలగం సినిమా గురించి కూడా అడిగారు. ఏళ్ల తరబడి ఎంతో మంది బాగా కోచింగ్లు తీసుకుని చదువుతున్నారు. వారికి పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. వయస్సు అయిపోతుంది. ఇదే చివరి ప్రయత్నం.
– సాయినాథ్, హనుమకొండ
కాజీపేట: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్-4 పరీక్షను చాలా బాగా రాశాను. తప్పకుండా ఉద్యోగం సాధిస్తా. ఎర్రగట్టు సమీపంలోని గ్రీన్వుడ్ స్కూల్లో సెంటర్ పడింది. బాగా ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ పేపర్ చాలా ఈజీగా ఉంది. రెండో పేపర్ బైపీసీ గ్రూప్ వారికి కష్టంగా ఉంది. 20 శాతం ఇంగ్లిష్ సబ్జెక్టుపై ప్రశ్నలు వచ్చాయి. 80 శాతం మ్యాథ్స్ సబ్జెక్టుపై ప్రశ్నలు అడిగారు. మొత్తానికి పేపర్లు ఈజీగా రావడంతో పరీక్షను చాలా బాగా రాశా.
– మూల హరీష, కాజీపేట