గాలి వాన బీభత్సం సృష్టించింది. వరంగల్ జిల్లాలో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా, గుడిసెలు నేలమట్టమయ్యాయి. ఓరుగల్లు నగరంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. కరంట్ సరఫరా నిలిచిపోవడంతో పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే పలుమార్లు వర్షం పడి పంట ఉత్పత్తులకు అపార నష్టం వాటిల్లగా, ఉన్న కొద్దోగొప్పో ధాన్యాన్ని అమ్ముకుంటే పెట్టుబడి పైసలయినా వస్తాయనుకున్న రైతులకు కన్నీళ్లే మిగిలాయి. ఇప్పుడు కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. నర్సంపేట మండలంలోని భోజ్యానాయక్ తండాలో పిడుగుపాటుతో ఒకరు మృత్యువాత పడగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి పరామర్శించారు.
– నమస్తే నెట్వర్క్
వరంగల్ చౌరస్తా, 20: గాలివాన శనివారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. నగరంలోని 36వ డివిజన్ చింతల్లో అతలాకుతలమైంది. ఈదురు గాలులు వీచి ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. డివిజన్లో సుమారు వందకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఓ ఇంటి పైకప్పు విద్యుత్ స్తంభాలపై కుమ్మరివాడ, చంద్రవదన కాలనీ, జ్యోతిబసుకాలనీ, పలు కాలనీల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిచి అంధకారం ఏర్పడింది. మున్సిపల్ అధికారులు స్పందించి డిజాస్టర్ టీంలతో సహాయక చర్యలు చేపట్టారు.
సందర్శించిన మేయర్
అకాలవర్షంతో అంధకారమైన చింతల్ను మేయర్ గుండు సుధారాణి సందర్శించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న చంద్రవదన కాలనీ, జ్యోతిబసు కాలనీ, ఎస్సీకాలనీ, కుమ్మరివాడలను సందర్శించి, నిలువ నీడ కోల్పోయిన బాధితులకు ధైర్యం చెప్పారు. వెంటనే అత్యవసర సహాయక బృందాలతో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యలు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులను ప్రభుత్వం తరఫున సహాయ, సహకారాలు అందించేందుకు ృషి చేస్తానని చెప్పారు. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు ఎంఏ.మసూద్, డివిజన్ అధ్యక్షులు వేల్పుగొండ యాకయ్య, చాంద్పాషా ఉన్నారు.
గీసుగొండలో…
గీసుగొండ: మండల వ్యాప్తంగా శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలి వీచగా చెట్లు నేలకూలాయి. గాలికి విద్యుత్ వైర్లపై చెట్లకొమ్మలు విరిగిడి, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తేలికపాటి వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యంపై తడవకుండా పరదాలతో కప్పి జాగ్రత్తలు తీసుకున్నారు.
నల్లబెల్లిలో..
నల్లబెల్లి: మండలంలో శనివారం గాలివాన, పిడుగులు కురిసి ప్రజల జీవనం అతలాకుతలమైంది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తడిసింది. కోతకు వచ్చిన వరి పంట పొలాల్లోనే గింజలు నేలరాలాయి. ఆరబోసిన మక్కజొన్నలు తడిశాయి. రేకుల షెడ్లు, నేలమట్టమయ్యాయి. విద్యుత్తు స్తంభాలు కూలాయి. ప్రధాన జాతీయ రహదారిపై చెట్లు విరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచి మండల ప్రజలు అంధకారంలో మగ్గిపోయారు.
ఖానాపురంలో..
ఖానాపురం: మండల వ్యాప్తంగా శనివారం ఈదురుగాలులతో కూడిన జల్లులు కురవడంతో రైతులు అతలాకుతలం అయ్యారు. పొదట్టి నుంచి తీవ్రమైన ఎండ ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి అకస్మాత్తుగా జల్లులు కురవడంతో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని తడవకుండా పరదాలు కప్పారు. అదేసమయంలో పోలీస్ వాహనంలో మనుబోతులగడ్డకు వెళ్తున్న ఎస్సై పిట్టల తిరుపతి పెద్దమ్మగడ్డ దాటాక రైతులు ధాన్యంపై పరదాలు కప్పుతుండగా చూసి వాహనం దిగి రైతులతో చేయి కలిపాడు.
మధ్యకోటలో..
పోచమ్మమైదాన్: వరంగల్ ఖిలా వరంగల్ మధ్యకోటలో శనివారం గాలిదుమారం, వర్షంతో ఆగమాగమైంది. యాకుబ్ ఇంటిపై వృక్షం ఇల్లు కూలి అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే దవాఖానకు తరలించగా ఆరు కుట్లు పడ్డాయి. దీంతో భార్య, పిల్లలు ఇంట్లో నుంచి పరుగెత్తారు. దాదాపు పది వరకు ఇళ్లు కూలిపోవడం, రేకులు ఎగిరిపోయి ఆస్తి నష్టం జరిగింది. చాలాచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి నేలపై పడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపోయాయి. రాత్రంతా అంధకారంలో గడపాల్సి వచ్చింది. స్థానిక కార్పొరేటర్ ఉమా దామోదర్ యాదవ్ ఆయా ప్రాంతాలకు సందర్శించారు. గాయపడ్డవారిని పరామర్శించి, కోసం తోడ్పాటు అందించారు.
డివిజన్లలో..
కాశీబుగ్గ: గాలివానతో నగరంలోని 18, 19 డివిజన్లలో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. 20, 14, 3 డివిజన్లలో విద్యుత్ స్తంభాలు విరిగాయి. సాయంత్రం 5గంటల నుంచి 10గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఎనుమాముల, గొర్రెకుంటలోని టీఎంసీ పత్తి మిల్లులు గాలివానకు ధ్వంసం అయ్యాయి. సత్యనారాయణ కోటెక్స్ కాటన్ ఇండస్ట్రీస్లోని రేకులు కొట్టుకుపోయాయి. మిషనరీ తడిసి రూ.15లక్షల వరకు నష్టం జరిగింది.