దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణ ఏర్పాటు లక్ష్యాన్ని నెరవేర్చేలా ఏకంగా 80వేల పోస్టుల భర్తీకి సమాయత్తమైంది. త్వరలోనే వరుస నోటిఫికేషన్లు జారీ చేయనుండగా ఈ మేరకు యువతకు ఉచితంగా శిక్షణ ఇచ్చి తోడ్పాటునందించాలని నిర్ణయించింది. నియోజకవర్గాల్లో ఉద్యోగార్థులకు ఫ్రీ కోచింగ్ సెంటర్లు పెట్టాలని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు సూచించింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యేలు భోజన వసతి కూడా కల్పిస్తూ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. దీంతో ఆర్థికంగా తమకు ఎంతో మేలు కలుగుతుందని యువతీయువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– వరంగల్, మార్చి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, మార్చి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలో 5,545 పోస్టులు భర్తీ కానున్నాయి. నోటిఫిషన్లు రావడం ఖాయమైపోవడంతో యువతీయువకులు కొలువులు కొట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఒకేసారి ఎక్కువ పోస్టులు పడుతుండడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పక్కాగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇదే సమయంలో యువతకు ఊతంగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చింది. విద్యార్హతల ఆధారంగా ఎవరు ఏ పోస్టుకు అర్హులు అనేదాన్ని ప్రామాణికంగా తీసుకుని అందరికీ అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగాలకు యువతీయువకులను సిద్ధం చేయడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ స్థానిక యువతకు ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు ఎమ్మెల్యేలు ప్రణాళికలు రూపొందించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తన అసెంబ్లీ నియోజకవర్గంలోని పాలకుర్తి, తొర్రూరులో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఇదివరకే నియోజకవర్గ యువతకు ఏటా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తుండడంతో ఇప్పుడూ పాలకుర్తి, తొర్రూరులో శిక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉద్యోగార్థులకు శిక్షణ ఇప్పించేందుకు సమాయత్తమయ్యారు. విద్యా సంస్థలు, శిక్షణ సంస్థలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడంతో యువతీయువకులందరికీ ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తన నియోజకవర్గ యువతకు శిక్షణ ఇప్పిస్తానని ఇప్పటికే ప్రకటించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సైతం ఏటా పదో తరగతి, డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ‘అరూరి గట్టుమల్లు’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2018 జూలై నుంచి పోటీ పరీక్షలపై యువతకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16న ముగియనుండగా తర్వాత ఎమ్మెల్యేలందరూ శిక్షణ కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భారీగా పోస్టులు భర్తీ చేస్తుండడంతో పాటు ఉచిత శిక్షణకు కూడా ఏర్పాట్లు చేస్తుండడంతో యువతలో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. ఇప్పటికే కొలువులు కొట్టే లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వారికి ఈ శిబిరాలు వరంలా నిలుస్తాయని, ఆర్థికంగా కలిసి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు మహబూబాబాద్ జిల్లాలో 1172, హనుమకొండలో 1157, జయశంకర్ భూపాలపల్లిలో 918, వరంగల్లో 842, జనగామలో 760, ములుగులో 696 పోస్టులు భర్తీ కానుండగా వీటిలో 95 శాతం స్థానికులకే దక్కనుండడంపై సంబుర పడుతున్నారు. జిల్లాతోపాటు జోనల్ పోస్టుల్లో నేరుగా అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం జోన్లో 1,630, భద్రాద్రి జోన్లో 2,858, యాదాద్రి జోన్లో 2,160 పోస్టులు భర్తీ కానుండడం, మల్టీ జోన్ స్థాయిలో 6800 పోస్టులు ఉండడం యువతలో కోటి ఆశలు రేపాయి. స్థానిక అభ్యర్థులు సొంత జిల్లాతో పాటు జోన్, మల్టీ జోన్లలో 95 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉంటారు. ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లో ఐదు శాతం ఓపెన్ కోటాలో పోటీకి అవకాశం ఉంటుంది. స్థానిక అభ్యర్థులకు జిల్లా కేడర్ పోస్టులు, జోనల్ కేడర్ పోస్టులకు అర్హత ఉంటుంది. ఆయా ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.
ఒకేసారి 80వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించడం గొప్ప విషయం. రాష్ట్రంలోని యువతకు ఇది మంచి అవకాశం. ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లకు అనుగుణంగా పాలకుర్తి నియోజకవర్గంలో యువత కోసం అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. విద్యార్హతల ఆధారంగా ఎవరు ఏ పోస్టులకు అర్హులు?, వారికి ఏ సబ్జెక్టులో శిక్షణ అవసరం? అనేది గుర్తించే కార్యక్రమాలు చేపడుతాం. తర్వాత పోస్టుల వారీగా ఉచిత శిక్షణ ఇప్పిస్తాం. పాలకుర్తి, తొర్రూరులో సెంటర్లు ఏర్పాటు చేస్తాం.
– ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
తెలంగాణ ఉద్యమ లక్ష్యం పూర్తిగా నెరవేరుతున్నది. సీఎం ఒకేసారి 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో యువతీయువకులు ప్రభుత్వ కొలువులు సాధించేలా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాం. హనుమకొండలో ఎక్కువ సంఖ్యలో ఉన్న విద్యా సంస్థల సహకారంతో యువతకు అన్ని విధాలా అండగా ఉంటాం.
– దాస్యం వినయభాస్కర్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్