బ్రహ్మ కనుంగొని బ్రణమిల్లి నిలిచి
బ్రహ్మ నీ వరశక్తి పంక్తి కంధరుడు
ప్రవిమలాచార్యుల బ్రహ్మర్షి వరుల
దివిజుల మునుల బాధింపుచున్నాడు
దారుణ వరశక్తి దలప మా చేత
వారిజాసన వాడు వారింపబడడు
సురగణంబుల తోడ సుత్రాము బట్టి
పరిభవించుచు నేచు బాహు దర్పమున
గంధర్వ యక్షాది గణముల మునుల
బంధించు సాధుల బట్టి బాధించు
వాడన్న కులగిరుల్వడవడ వణుకు
వేడిమి చూపగ వెఱచు భాస్కరుడు
ఈ ద్విపద పాదాలు గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం లోనివి. దేశీ ఛందస్సును ఎక్కువగా తెలంగాణ ప్రాంత కవులే ఆదరించారు. ఆద్యులు కూడా. తెలుగులో మొదటి సంపూర్ణ రామాయణం ఇది. మొదటి అచ్చ తెనుగు కావ్యం, మొదటి శతకం, మొదటి జంట పద్య కవులు, మొదటి శతావధాని ఇలా ఈ ప్రాంత పద్య కవులు చాలా విషయాల్లో మొదటి వారుగా ఉన్నారు. విఠ్ఠల రంగనాథుడగు తన తండ్రి పేరుతో ఈ రామాయణం వెలువరించారు గోన బుద్ధారెడ్డి. ఈ కావ్యం మొదటి ప్రతాప రుద్రుని కాలంలో వెలువడింది. అది దాదాపు క్రీ.శ.1290-1300కు సరిపోతుందని పరిశోధకుల అంచనా. ప్రముఖ తొలి తెలుగు కవయిత్రి కుప్పమాంబ ఈతని కూతురు. మహబూబ్నగర్ ప్రాంతంలోని వడ్డె మానుపురాన్ని బుద్ధారెడ్డి కుటుంబం ప్రతాపరుద్రుని సామంత రాజులుగా పరిపాలించింది.
పైన పేర్కొన్న ద్విపద పాదాలు దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లి రావణుడు తమను హింసించడం గురించి చెబుతూ తరుణో పాయం అడుగుతున్న సందర్భం. భావం సులభంగానే ఉంది. ‘బ్రహ్మదేవా! నీ వరశక్తి గర్వంతో ఈ పది తలల రావణుడు మునులను, దేవతలను ఎంతో బాధిస్తున్నాడు. ఇతనికి భయపడి కులగిరులు వణకిపోతున్నాయి. శక్తిమంతుడైన సూర్యుడు కూడా తన వేడిని లోకానికి పంచడానికి భయపడుతున్నాడు’ అంటూ రావణుడు తమను హింసిస్తున్న రీతిని బ్రహ్మతో విన్నవించుకోవడం ప్రస్తుత ద్విపద పాదాల భావం.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ