హనుమకొండ, మే 30 : కార్మికుల సంక్షేమానికే యుద్ధభేరిని నిర్వహిస్తున్నట్లు చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. కార్మిక, ఉద్యోగ చైతన్య మాసోత్సవం ముగింపు సందర్భంగా బుధవారం హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్న యుద్ధభేరి సభ ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. అనంతరం అతిపెద్ద బెలూన్ను ఎగురవేశారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఉద్యోగ, కార్మికులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, రాష్ట్ర సర్కారు వారికి అండగా ఉందన్నారు. కార్మికుల హక్కులను కేంద్రం కాలరాస్తోందన్నారు. యుద్ధభేరి సభకు ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్రావు హాజరుకానున్నారని, పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బుధవారం హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్న కార్మిక ‘యుద్ధభేరి’ని పురస్కరించుకొని మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వినయ్భాస్కర్ మాట్లాడారు. గతంలో పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు కార్మికులను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ సమన్యాయం చేస్తున్నారన్నారు. 54 రంగాల్లో పనిచేస్తున్న సంఘటిత, అసంఘటిత కార్మికుల కోసమే సంక్షేమ మాసోత్సవం ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికుల స్థితిగతులు తెలుసుకోవడంతోపాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ, పిల్లలను ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేర్చించినట్లు తెలిపారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులున్న కార్మికులకు రూ.23వేల విలువైన 23 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. కార్మికుల కోసం సీఎం కేసీఆర్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేస్తున్నారన్నారు.
తొమ్మిదేండ్లలో 6,914 మంది కార్మికులకు రూ.45.71కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం నాలుగు కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తూ వారి పొట్టకొడుతోందన్నా రు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కార్మిక భవనాలు నిర్మిస్తున్నారని, అందులో సభలు, సమావేశాలే కాకుండా స్కిల్ డెవలప్మెంట్, మహిళలకు రకరకాల శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నట్లు చీఫ్ విప్ తెలిపారు. ఓరుగల్లు నుంచి ప్రారంభించిన ఏ పోరాటమైనా విజయవంతమైందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ, రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుందన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న 4 కోడ్లను రద్దు చేసి, ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతంలో అమలు చేయాలని చీఫ్ విప్ డిమాండ్ చేశారు. కార్మిక యుద్ధభేరి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన టీ షర్ట్స్ను తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్ ఆవిష్కరించారు.
ముఖ్యఅతిథిగా మంత్రి హరీశ్రావు
కార్మిక యుద్ధభేరి సభకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హాజరుకానున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు హరీశ్రావు హనుమకొండకు చేరుకొని, హంటర్రోడ్డులోని మెడికల్ కళాశాలను ప్రారంభిస్తారన్నారు. అక్కడి నుంచి హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన(జీఎంహెచ్)లో నిర్మించిన తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్తోపాటు, వరంగల్ కేఎంసీలో పలు ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. అనంతరం 24 అంతస్తులతో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులను పరిశీలిస్తారని తెలిపారు. అక్కడి నుంచి హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సందర్శించి, పార్టీ శ్రేణులతో సమావేశమవుతారన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత కార్మిక యుద్ధబేరి సభా ప్రాంగణానికి చేరుకుంటారని దాస్యం తెలిపారు. సమావేశంలో కార్మిక, ఉద్యోగ సంక్షేమ మాసోత్సవ కోఆర్డినేటర్ పుల్ల శ్రీనివాస్, జాన్సన్, ఏనుగుల రాంప్రసాద్, బత్తిని శ్రీనివాస్, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కార్మికులను కలిసిన చీఫ్ విప్
ఉద్యోగ, కార్మిక సంక్షేమ మాసోత్సవంలో భాగంగా బుధవారం నిర్వహించనున్న కార్మిక యుద్ధభేరిని విజయవంతం చేయాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. ఈ మేరకు హనుమకొండలోని రుద్రమదేవి ఆటో అడ్డా, సుబేదారి ఆటో అడ్డాలోని ఆటో కార్మికులతోపాటు, నిట్లోని సెక్యూరిటీ కార్మికులను చీఫ్ విప్ కలిశారు.ఈ సందర్భంగా సరదాగా ఆటో నడుపుతూ ఆటో కార్మికుల మంచి చెడ్డలను తెలుసుకున్నారు. అనంతరం హనుమకొండలోని పలు షాపింగ్ మాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్ల నూతన విధానం తీసుకొచ్చిందన్నారు. దీంతో కార్మికులు కనీస వేతనం పొందలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా కార్మిక యుద్ధభేరి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మిక లోకమంతా ఏకమై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంక్షేమ మాసోత్సవ కోఆర్డినేటర్లు పుల్ల శ్రీనివాస్, జాన్సన్, కేశోజు ప్రణయ్ పాల్గొన్నారు.