ఖిలావరంగల్, ఆగస్టు 2 : మహానగర పాలకసంస్థలోని విలీన గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. మౌలిక వసతుల కల్పనకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నారు. సమస్యల లోగిళ్ల నుంచి అభివృద్ధి వైపు గ్రామాలు పయనిస్తుండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కోవలో పరకాల నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ని ఆదర్శనగర్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. గతంలో ఇక్కడ గుంతలమయమైన ప్రధాన రహదారి మినహా ఏ ఒక్క రోడ్డు కూడా లేని పరిస్థితి ఉండేది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అభివృద్ధే ధ్యేయంగా రూ.కోటి నిధులతో పనులు చేపట్టారు. ఆదర్శనగర్లోని ప్రతి వీధికీ సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. పట్టణ ప్రగతిలో భాగంగా గుర్తించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. అలాగే, రెండు కమ్యూనిటీ భవనాలను కూడా మంజూరు చేశారు. ఈ పనులు త్వరలో చేపట్టనున్నట్లు స్థానికులు తెలిపారు. అలాగే, విద్యుత్ స్తంభాలను నూతనంగా ఏర్పాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రతి వాడకూ వీధి దీపాలు అమర్చడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదర్శనగర్ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేపట్టారు. అలాగే, జానీపీరీల గేటు నుంచి స్తంభంపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే ఆదర్శనగర్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతోంది.