చిగురుమామిడి/భీమదేవరపల్లి, జూలై 29 : అతను ఫైర్ స్టేషన్లో పని చేసే సిబ్బంది. ఉదయం ఓ బావిలో కారు పడిందని సమాచారం అందింది. వెంటనే తన బృందంతో కలిసి అక్కడికి వెళ్లాడు. బావి నిండా నీరుండడంతో అందులోంచి కారును తీసేందుకు శతవిధాలా కలిసి ప్రయత్నించాడు. ఓవైపు కారులో ఎంతమంది ఉన్నారోనన్న ఉత్కంఠ మధ్య చివరికి రాత్రి వరకు క్రేన్ల సాయంతో కారును బయటకు తీశారు. అందులో ఉన్న మృతదేహాన్ని చూసి ఆ రెస్క్యూ టీం సభ్యుడు హతాశుడయ్యాడు. చనిపోయిందని తన అన్నే అని తెలిసి ఘటనా స్థలంలోనే కన్నీరుమున్నీయ్యాడు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి వివరాలు..
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం పుల్యానాయక్తండాకు చెందిన బానోతు పాపయ్యనాయక్ రెండేళ్ల క్రితం హుస్నాబాద్ దగ్గర్లోని అక్కన్నపేట మండలంలో ఎస్ఐగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. కరీంనగర్లో కుటుంబంతో స్థిరపడ్డాడు.
గురువారం ఉదయం 10, 11గంటల సమయంలో కరీంనగర్ నుంచి స్వగ్రామం పుల్యానాయక్ తండాకు కారులో బయలుదేరాడు. మార్గమధ్యలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ సమీపంలో క్రాసింగ్ వద్ద ఉన్న వ్యవసాయ బావిలోకి కారు దూసుకుపోయింది. గమనించిన స్థానికులు కేకలు వేస్తూ అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బావి నిండా నీళ్లు ఉండడంతో గ్రామస్తులు, పోలీసులు, రెస్క్యూటీం సభ్యులు రాత్రి వరకు శ్రమించి క్రేన్ ద్వారా కారును బయటకు తీశారు. మొదట కారులో ఎంత మంది ఉన్నారోనన్న ఉత్కంఠ నెలకొం ది. కానీ కారులో ఒక్కడే ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
షాక్ తిన్న సోదరుడు..
బావిలోంచి కారును బయటకు తీయడంలో ఫైర్ సిబ్బంది మధ్యా హ్నం నుంచి శ్రమించారు. విధుల్లో మానకొండూర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భూదయ్య నాయక్ కూడా ఉన్నా డు. రాత్రి 8.30గంటల ప్రాంతంలో కారును క్రేన్తో వెలికి తీయగా, ఆ కారు నంబర్ చూసి అనుమానించాడు. కారును బయటికి తీసిన తర్వాత డోర్లు తెరిచి చూడగా అందులో ఉన్నది తన అన్నని తెలిసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. మృతదేహంపై పడి బోరుమన్నాడు. బావిలో పడింది తన అన్న అని ఏమాత్రం ఊహించలేదని, ఘోరం జరిగిపోయిందని కన్నీరుమున్నీరుగా రోదించాడు. మృతుడు పాపయ్య నాయక్కు భార్య భారతి, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. వారి ఫిర్యాదు మేరకు చిగురుమామిడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.