మంగపేట, మే 26 : మండలంలోని మల్లూరు హేమాచలుడి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన లక్ష్మీనర్సింహస్వామి వారి కల్యాణం బుధవారం నిరాడంబరంగా జరిగింది. ఉదయం స్వామి వారి గర్భ గుడిలో భద్రాచలం ఆలయ అర్చకుడు శ్రీమురళీకృష్ణమాచార్యుల బృందం, స్థానిక అర్చకులు బాలభోగము, విశ్వక్సేన పూజాకార్యక్రమాలు, మూల స్వామి, ఆదిలక్ష్మి-చెంచులక్ష్మి కల్యాణం, నైవేద్య కార్యక్రమాలు జరిపించారు. అనంతరం దేవస్థాన ప్రాంగణంలోని యాగశాలలో హోమాలు నిర్వహించారు. అనంతరం అభిజిత్ లగ్న సుముహూర్తాన లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి-చెంచులక్ష్మికి శాస్ర్తోక్తంగా కల్యాణ తంతు నిర్వహించారు. వేడుకల్లో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి శ్రావణపు సత్యనారాయణ, అర్చక బృందం మురళీకృష్ణమాచార్యులు, కైంకర్యం రాఘవాచార్యులు, ముక్కమాల రాజశేఖరశర్మ, పవన్కుమార్ ఆచార్యులు, ఈశ్వర్చందుశర్మ, సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, సుధీర్, వెంకటనారాయణశర్మ, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు. ఎస్సై తాహెర్ బాబా సూచనల మేరకు కొవిడ్ నిబంధనలకు విఘాతం కలుగకుండా పోలీసులు గుట్టపై, ఆర్చీ వద్ద బందోబస్తు చేపట్టారు.