పోలీసులు అవగాహన పెంపొందించుకోవాలి
నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి
గీసుగొండ, జూన్ 3: పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి సూచించారు. గురువారం ఆయన గీసుగొండ పోలీస్స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ క్వార్టర్స్ను పరిశీలించారు. స్టేషన్లో సన్నిహిత కౌంటర్ పనితీరు, ఫిర్యాదుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్లో అధికంగా నమోదవుతున్న కేసుల వివరాలు.. శాంతిభద్రతలు, నేరనియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలను సీఐని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సేవలు అందించేందుకు రూపొందించిన వర్టికల్స్ విధానంపై పోలీసులు మరింత అవగాహన పెంపొందించుకునేలా అధికారులు శిక్షణ ఇవ్వాలని సూచించారు.
తక్షణమే స్పందించాలి
ప్రజలు స్టేషన్కు వస్తారని, వారి ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలని సీపీ సూచించారు. ప్రజల నమ్మకానికి తగ్గట్టు పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. నేరాల నియంత్రణ కోసం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మామునూరు ఏసీపీ నరేశ్కుమార్, గీసుగొండ సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సైలు అబ్దుల్ రహీం, రాజు పాల్గొన్నారు.