వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి దాన్యపు గింజను కేంద్రం కొనుగోలు చేయాలని మాజీ మేయర్ గుండా ప్రకాష్రావు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు లు అన్నారు. శుక్రవారం వరంగల్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై కక్ష కట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో మాత్రం కొనుగోలు చేయకపోవడాన్ని బట్టి బీజేపీ పాలనను అర్ధం చేసుకోవచ్చునని అన్నారు.
రాజకీయంగా తన ఎదుగుదలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ తెలంగాణ రైతులను కష్టాలపాలు చేస్తుందని అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి చెప్పిన జై జవాన్ జై కిసాన్ నినాదంతో పాలన సాగించిన రాజకీయ పార్టీలు నేటికి మనుగడ సాగిస్తున్నాయని, రైతును ఇబ్బందులు పెట్టిన ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశంలో మనుగడ కొనసాగించలేదని వారు అన్నారు. నెలల తరబడి ఢిల్లీ శివారుతో పాటుగా ఇతర రాష్ట్రాలలో తమదైన తీరులో నిరసనలు తెలియజేస్తున్న రైతులను హత్యలు చేస్తూ, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని వారు అన్నారు.
అనంతరం రైతుల కష్టాలను తీర్చడానికి కృషి చేస్తూ, రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొల్లూరి యోగానంద్, డాక్టర్ హరిరమాదేవి, తాబేటి వెంకట్ గౌడ్, మాజీ కార్పొరేటర్ చింతం యాదగిరి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.