హనుమకొండ కలెక్టరేట్లో ‘దళితబంధు’ జాతర కొనసాగింది. కమలాపూర్ మండలానికి చెందిన 51మంది లబ్ధిదారులకు రూ.4,86,89,879 విలువగల ఆస్తుల పంపిణీ గురువారం పండుగలా జరిగింది. 10 హార్వెస్టర్లు, రెండు ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ఆటో ట్రాలీ, రెండు బొలెరో వాహనాలు, ఎక్స్కవేటర్, 18 ట్రాక్టర్లు, రోట వేటర్లు, ట్రాలీల తాళాలు అందుకున్న దళితుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో యూనిట్లు పొందిన లబ్ధిదారుల కుటుంబాల్లో బతుకుపై భరోసా నిండింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం దేశానికే దిక్సూచి అని, దమ్ముంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో దీన్ని అమలు చేయాలని అమాత్యులు సవాల్ చేశారు. అంబేద్కర్ను గౌరవించే ఏకైక సీఎం కేసీఆర్, దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఈ పథకం తెచ్చారని స్పష్టం చేశారు.
హనుమకొండ, ఫిబ్రవరి 3 : రాష్ట్రంలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బృహత్తర పథకం దళితబంధు అని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే తాము పాలించే రాష్ర్టాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని సవాల్ చేశారు. కమలాపూర్ మండలానికి చెందిన 51మంది లబ్ధిదారులకు దళితబంధు కింద మంజూరైన యూనిట్లను హనుమకొండ కలెక్టరేట్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి గురువారం పంపిణీ చేశారు. అనంతరం హనుమకొండ, వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మలుగు, మహబూబాబాద్ జిల్లాల అధికారులు, ఎమ్మెల్యేలతో కలిసి దళితబంధు అమలుపై నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఈ రోజు ఒక పండగ దినమని, కమలాపుర్ మండలంలోని దళితబంధు లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా 90 శాతం దళిత కుటుంబాలు దారిద్య్రంలో మగ్గుతున్నాయని చెప్పారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా దళితబంధును తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకం దేశానికే దిక్సూచి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17లక్షల మంది దళితులకు దశలవారీగా పథకాన్ని వర్తింపజేసే ప్రణాళికతో సీఎం కేసీఆర్ ముందుకుపోతున్నారని చెప్పారు. ఈ పథకంపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారి ముఖాలపై తన్నేలా ప్రణాళికాబద్ధంగా పథకం అమలు చేస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో 17,556 మందిని ఎంపిక చేశామన్నారు. ఈ నియోజకవర్గంలో దళిత రక్షణ నిధిలో రూ.35కోట్లు ఉన్నాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకి అని, దళితులను ఊచకోత కోసిన చరిత్ర దానిదని మండిపడ్డారు. ఈ నెల 5లోగా అన్ని నియోజకవర్గాల పరిధిలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని, మార్చి 7లోగా గ్రౌండింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
డ్రైవర్లు, క్లీనర్లను దళితబంధు పథకంలో ఓనర్లు చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను గౌరవించే ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని, అంబేద్కర్ను కేసీఆర్ విమర్శించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీనిని ప్రజలు గమనించాలన్నారు. రాజ్యాంగంతోనే పేదలకు న్యాయం జరుగుతుందని, పేదలకు మరింత న్యాయం జరిగేందుకే రాజ్యాంగంలో మార్పులు చేసి ఇంకా పటిష్టం చేయాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని స్పష్టం చేశారు. దళితులపై చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కమలాపూర్ మండలంలో 3,893 మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన సాయంతో లబ్ధిదారులు బాగుపడి మరికొందరికి ఉపాధి చూపాలని సూచించారు. కమలాపూర్ మండలంలో లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారులను మంత్రి అభినందించారు. పథకం పక్కాగా అమలుకోసం జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక అధికారిని నియమించాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదేనన్నారు.
దళితబంధు పథకం ముఖ్యమంత్రి మానస పుత్రిక అని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఇప్పటికే వాసాల మర్రిలో పైలట్ ప్రాజెక్టు పూర్తి చేశారని చెప్పారు. రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 100మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ బడ్జెట్ సమావేశాల్లోపే వారి ఖాతాల్లో డబ్బులు వేసి పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. పథకం అమలైన గ్రామాలను చూసినప్పుడు ఏయే యూనిట్లు అమలు చేస్తే వారికి లాభసాటిగా ఉంటుందో తెలిసిందన్నారు. ఇప్పటికే కలెక్టర్ల ఖాతాల్లో నగదు జమ చేశారని, మార్చి 7 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారని చెప్పారు.
దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. పట్టణ పరిధిలో ఎంపిక చాలెంజ్లాంటిదన్నారు. లబ్ధిదారులు కోరుకున్న యూనిట్ల ఆధారంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. పట్టణ పరిధిలో కొందరు లబ్ధిదారులు మ్యానుప్యాక్చరింగ్ యూనిట్ల వైపు మొగ్గు చూపుతున్నారని, ఇందుకుగాను మార్కెటింగ్ చర్యలు తీసుకుంటే బాగుంటుందని చీఫ్విప్ సూచించారు. కార్యక్రమాల్లో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, చల్లా ధర్మారెడ్డి, జడ్పీ చైర్మన్లు సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ విజయ్కుమార్, కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, గోపి, శివలింగయ్య, శశాంక, రూపేశ్ మిశ్రా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, అదనపు కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు, పాల్గొన్నారు.
ఎవుసం, కూలినాలి చేసుకునే మమ్ములను దళితబంధుకు ఎంపిక చేసిన్రు. శాన సంబురమైంది. ఈ పథకంతో వరికోత మిషన్ కొనుక్కున్నం. దీనితోటి ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకుంటం. మా కుటుంబాలను మంచిగ పోషించుకునే అవకాశం కలిగింది. మా బతుకులకు దారి చూపిన సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
– కొండ్ర నర్సయ్య, కొండ్ర ఎల్లయ్య, వంగపల్లి, కమలాపూర్ మండలం