తాడ్వాయి, ఫిబ్రవరి 3 : మేడారం మహా జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల బస్సులు నడుపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ముందుగా ఆయన సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. మేడారం ఆర్టీసీ బస్టాండ్లో చేసిన ఏర్పాట్లతో పాటు టికెట్ కౌంటర్లు, క్యూలైన్లు, సిబ్బంది బస చేసేందుకు ఏర్పాటు చేసిన షెడ్లను పరిశీలించారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్సింగ్ జీపాటిల్తో ట్రాఫిక్ సమస్యలు, భక్తులకు ఇబ్బదులు కలుగకుండా ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో కంటే ఎక్కువగా భక్తులు ఆర్టీసీని ఆదరిస్తున్నారని తెలిపారు. రద్దీని బట్టి సర్వీసులు పెంచుతామన్నారు.
ఈనెల 13 నుంచి 12,500 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని, రాష్ట్రంలోని 51 పాయింట్ల నుంచి బస్సు సర్వీసులు నడిపిస్తామని తెలిపారు. ప్రైవేట్ వాహనాలను అమ్మవార్ల గద్దెలకు దూరంగా నిలిపేస్తారని, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే గద్దెలకు సమీపంలో ఇబ్బంది లేకుండా దిగుతారని భక్తులకు సూచించారు. అలాగే తాడ్వాయిలోని టికెట్ ఇష్యూ పాయింట్ను పరిశీలించారు.
టికెట్లు ఇచ్చే విధానాన్ని తెలుసుకున్నారు. వీఐపీ పార్కింగ్, శివరాంసాగర్ చెరువుల వద్ద ఏర్పాటు చేసిన అదనపు బస్సు పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ముఖ్యంగా డ్రైవర్లకు ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు, ఓవర్టేక్ల విషయంలో పలు సూచనలు చేయాలని, అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులు సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకునేలా చూడాలని అన్నారు. ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ రఘునాథరావు, మునిశేఖర్, రీజినల్ మేనేజర్ విజయభాస్కర్, డివిజనల్ మేనేజర్ శ్రీదేవి, డిపో మేనేజర్లు భానుకిరణ్, మహేశ్కుమార్, హోహన్, కిరణ్రెడ్డి, బుచ్చయ్య ఉన్నారు.