హనుమకొండ, ఫిబ్రవరి 14 : మహాత్ముడి బాటలో పోరాడి దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసి, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సుసాధ్యం చేసి రాష్ట్ర ప్రజల గుండెల్లో తెలంగాణ గాంధీగా నిలిచిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభివర్ణించారు. ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్తో కలిసి హనుమకొండలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 17న కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని 15,16,17 తేదీల్లో వేడుకలను ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందులో ప్రజలందరినీ భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని సూచించారు. పల్లెప్రగతి ప్రదాత కేసీఆర్ చూపిన బాటలో గ్రామాలన్నీ పచ్చగా.. పరిశుభ్రంగా స్వయం సమృద్ధిగా మారాయన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్, అభివృద్ధి ప్రదాతగా నిలిచారన్నారు. సీమాంధ్ర పాలనలో కరువు కాటకాలతో నెర్రెలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. వైద్యం, విద్యకు అధిక ప్రాధన్యమిస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేశారని చెప్పారు. సబ్బండ వర్గాల వారికి సీఎం కేసీఆర్ సంక్షేమ సారథి అయ్యారన్నారు. పంటకు పెట్టుబడి, రైతు బీమా, రుణాల మాఫీ, కోతలు లేని 24గంటల ఉచిత నాణ్యమైన కరెంటు, పంటల కొనుగోళ్లతో రైతులకు సీఎం ఆత్మబంధువు అయ్యారన్నారు. 15న దవాఖానలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో అన్నదానం, పండ్ల పంపిణీ చేయాలన్నారు. 16న అన్ని నియోజకవర్గకేంద్రాల్లో మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. 17న రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు చేయాలని, మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పల్లెప్రగతి తరహా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేయాలన్నారు.
17న రైతు దినోత్సవం..
సీఎం కేసీఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17ను రైతు దినోత్సవంగా జరిపేందుకు వ్యవసాయ శాఖ నిర్ణయించిందని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 2,601 కస్టర్లలకు సంబంధించి ఉత్తమ రైతులను గుర్తించి వారిని 17న రైతు వేదికల వద్ద సన్మానించాలన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనడు సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని వర్గాల ప్రజల అపద్బాంధవుడైన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను మూడు రోజల పాటు ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఇందులో రైతులు భాగస్వామలయ్యేలా రైతుబంధు కో ఆర్టినేటర్లు, కార్యకర్తలు చూడాలన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకనే బీజేపీ నాయకులు, ముఖ్యంగా బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారని, విద్యుత్ రంగంపై అవగాహన లేక, ఇంగ్లిష్ అర్థం కాని బండి సంజయ్ ఏవేవో పిచ్చి కూతలు కూస్తున్నారని, ఇది మానుకోవాలని హెచ్చరించారు. కరెంటుపై కేసీఆర్కే పాఠాలు చెపుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పటికే రెండు సార్లు ఒంటరిగా గెలిచామని, రాబోవు రోజుల్లో కూడా టీఆర్ఎస్సే గెలుస్తుందని, అమరులను కీర్తించింది, గౌరివించింది, ఆర్థికంగా ఆదుకున్నది తెలంగాణ రాష్ట్రం.. టీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీజేపీ ఆటలు సాగవని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అనంతరం జరిగిన పరిణామాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ తెలంగాణపై విషం చిమ్ముతున్నదని, ప్రజలు అంతా గమనిస్తున్నారని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే అందరూ కోరుకుంటున్నారని తెలిపారు.