హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 16: ఒకప్పుడు అన్నీ సిజేరియన్ ప్రసవాలే.. సాధారణ ప్రసవం అనే మాటే వినిపించట్లేదు.. ఈ క్రమంలో ‘కోత’లను తగ్గించి, సాధారణ ప్రసవాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులపై సర్కారు ఫోకస్ పెట్టింది. గత ఏడాదితో పోల్చితే సిజేరియన్ డెలివరీల రేటు చాలా తగ్గిందని వైద్యాధికారుల గణాంకాలు చెబుతున్నాయి. సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేపట్టిన సంస్కరణల కారణంగా సిజేరియన్ డెలివరీల రేటు తగ్గింది. జ్యోతిష్యం ఆధారంగా ప్రసవాలను ఇష్టపడే గర్భిణులు, దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం అంటే ఆందోళన చెందే రోజులు మారాయి. ప్రస్తుతం ప్రైవేట్ కంటే సర్కారు దవాఖానాలకు ప్రసూతి కోసం వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటుండడంతో ప్రభుత్వ దవాఖానలకు వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచనల మేరకు సాధారణ ప్రసవాల వలన కలిగే ప్రయోజనాలు వివరిస్తూ వాటిని మరింత పెంచేవిధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కాన్పుల కోసం ప్రభుత్వ దవాఖానాకు..
కాన్పు కోసం ప్రైవేట్ దవాఖానలకు వెళ్తే రూ.వేలల్లో ఖర్చుతో పాటు సిజేరియన్ చేయడానికే ఎక్కువగా వైద్యులు ప్రాధాన్యమిస్తారు. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు వచ్చేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక్కడ ప్రతిరోజూ 400 వరకు ఓపీ చూస్తుండడం విశేషం. ప్రతిరోజూ 15 నుంచి 20 వరకు డెలివరీలు జరుగుతున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడికి జిల్లాతో పాటు ఇతర జిల్లాల వారు కూడా ప్రసూతి కోసం వస్తారు.
పెరిగిన సాధారణ ప్రసవాలు..
మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో పాటు సాధారణ ప్రసవాలు చేసేలా వైద్యులు, సిబ్బంది చొరవ చూపుతుండడంతో దవాఖానకు వచ్చే గర్భిణుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. హనుమకొం డ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ప్రసవాలకు వచ్చే మహిళలకు వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులకు ఇస్తున్న సలహాలు, వారికి అందుతున్న చికిత్సతో దూరప్రాంతాల నుంచి సాధారణ ప్రసవాలకు తరలివస్తున్నారు.
వైద్యుల ప్రత్యేక శ్రద్ధ..
ప్రసవాలకు వచ్చే మహిళలకు ముందుగా ఉన్న అపోహలను తొలిగించడమే కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు సూచనలు పాటిస్తూ మహిళల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యమని వైద్యులు చెబుతున్నారు. హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానాలో అధిక ప్రసవాలు జరుగుతున్నాయి. గర్భిణుల ఆరోగ్యంపై వైద్య సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి సారిస్తుండటంతో సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని, గత సంవత్సరంతో పోల్చితే ఇప్పుడు సాధారణ ప్రసవాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి తెలిపారు. సాధారణ ప్రసవం వలన కలిగే ప్రయోజనాలపై గ్రామాల్లోని ఆశ కార్యకర్తలు గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. క్రమం తప్పకుండా పరీక్షల కోసం దవాఖానకు వచ్చేలా సిబ్బంది కృషి చేస్తున్నారు. గ్రామస్థాయిలో ఆశ కార్యకర్తలు గర్భిణి కుటుంబంలోని వారికి అవగాహన కల్పించడంతో పాటు సాధారణ ప్రసవాల వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తుండడం సత్ఫలితాలను ఇస్తుందని అధికారులు తెలిపారు.
సాధారణ కాన్పులకే ప్రాధాన్యం..
జీఎంహెచ్లో రోజురోజుకు సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. తప్పనిపరిస్థితుల్లో తప్ప ఎక్కువ శాతం సాధారణ కాన్పులకే ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతిరోజూ 400 వరకు ఓపీ చూస్తున్నారు. ప్రతిరోజూ 15 నుంచి 20 వరకు డెలివరీలు అవుతుండగా వారానికి సుమారు వంద వరకు ప్రసవాలు అవుతున్నాయి. నెలకు 550-600 వరకు డెలివరీలు జరుగుతుండగా ఎక్కువగా సాధారణ ప్రసవాలే అవుతున్నాయి.
– డాక్టర్ బీ విజయలక్ష్మి, హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన సూపరింటెండెంట్