శక్కర్నగర్, ఏప్రిల్ 27: నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ తరలింపు వ్యవహారం ఘర్షణకు దారి తీసింది. స్మగ్లర్ల పరస్పర దాడిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బోధన్ పట్టణ శివారులో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నది. మంజీర నది నుంచి అర్ధరాత్రి సమయంలో జోరుగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. బోధన్కు చెందిన యూసుఫ్ టిప్పర్లో శుక్రవారం రాత్రి ఇసుక తీసుకొస్తున్నాడు. బీటీనగర్కు చెందిన మరో ఇసుక స్మగ్లర్ అర్బాజ్ఖాన్ అలియాస్ లడ్డు నాగన్పల్లి దాబా వద్ద టిప్పర్ను అడ్డుకున్నాడు.
అర్బాజ్ఖాన్.. యూసుఫ్పై దాడిచేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్వల్పంగా గాయపడిన యూసుఫ్ తన మిత్రుడు ఇర్ఫాన్, మరికొంత మందితో కలిసి బీటీనగర్లోని అర్బాజ్ఖాన్ ఇంటికి వెళ్లి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అర్బాజ్ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ వీరయ్య తెలిపారు.