గంగాధర, ఏప్రిల్ 27 : భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి రూ.10 వేలు లంచం తీసుకుంటూ శనివారం కరీంనగర్ జిల్లా గంగాధర ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకంపేటకు చెందిన కొకుల అజయ్కుమార్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి శివారులో 486.42 చదరపు గజాల భూమిని తన తండ్రి కొకుల రాజేశం నుంచి గిఫ్ట్ డీడ్ చేయించుకోవడానికి రెండు రోజుల క్రితం గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు.
గంగాధరకు చెందిన తన మిత్రుడు ఆకుల అంజయ్య ద్వారా ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్ శివారం సురేశ్బాబును సంప్రదించారు. గిఫ్ట్ డీడ్ చేయడానికి ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ రూ.10 వేల లంచం డిమాండ్ చేయగా ఆకుల అంజయ్య ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. శనివారం రిజిస్ట్రేషన్ అనంతరం సురేశ్బాబు సూచనల మేరకు రూ.10 వేలను కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి కొత్తకొండ శ్రీధర్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ సురేశ్బాబు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీధర్పై కేసు నమోదు చేసి, వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.