జరిగిన కథ : ఉజ్జయినిలో ఉండే
మదనాంకుడు ఒక విద్యాధర కన్యతో మోహంలో పడ్డాడు. ఆమెను కలుసుకోవడం కోసం పుష్కరావతికి బయల్దేరాడు. మధ్యలో ఒక యక్షిణిని వశపరుచుకుని, ఆమె సాయంతో హిమాలయాల వరకూ వెళ్లాడు. అక్కడ ఒక స్త్రీపై మోహం కొద్దీ మర్కటరూపం పొందిన చంద్రస్వామి.. తన కథను మదనాంకుడితో చెప్పాడు. ఆ తరువాత యక్షిణి సాయంతోనే మదనాంకుడు విద్యాధర కన్యను కలుసుకున్నాడు.
అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ
మదనాంకుణ్ని చూడగానే రాగవతి పరుగున వచ్చి కౌగిలించుకుంది. దానితో అతనికి బడలిక మొత్తం తీరిపోయింది. ఒక మానవుణ్ని తనతోపాటు ఇంటికి తీసుకుపోతే తల్లిదండ్రులు శిక్షించగలరని భయపడిన రాగవతి.. తన విద్యాబలంతో ఆ తోటలోనే ఒక మందిరం నిర్మించింది. అందులో మదనాంకుణ్ని ఉంచింది. ఇతరులకు తెలియకుండా రోజూ అక్కడికి రాకపోకలు సాగించింది. కొంతకాలం వారి ప్రణయం ఏ ఆటంకమూ లేకుండా కొనసాగింది.
ఒకనాడు మదనాంకుడు తాను వచ్చేదారిలో హిమాలయాల వద్ద ఒక మర్కటాన్ని చూసిన ఉదంతాన్ని రాగవతికి తెలియచేశాడు.
“అతణ్ని నువ్వు మళ్లీ మనిషిగా చేయగలవా?” అని ప్రశ్నించాడు.
“శాకిని, డాకినిలాంటివాళ్లు అలాంటి పనులు చేస్తుంటారు. మేము చేయలేం” అని చెప్పింది రాగవతి.
“అవునా! నా మిత్రుడు పాపం ఎన్ని కష్టాలు పడుతున్నాడో! నాకోసం పరితపిస్తూ ఉంటాడు. కనీసం నన్నోసారి అక్కడికి తీసుకుపోయి చూపించగలవా?” అని అడిగాడు మదనాంకుడు.
“ప్రియా! నేను నీకు ఉత్పాతిని, అవతరిణి అనే రెండు విద్యలు ఉపదేశిస్తాను. వాటి సాయంతో నీకు గగనసంచార శక్తి కలుగుతుంది. నువ్వు వెళ్లి నీ మిత్రుణ్ని కలుసుకుని, మంచిచెడ్డలు విచారించి రేపటికల్లా తిరిగి రావాలి. నువ్వు లేకుంటే నేనుండలేను” అన్నది రాగవతి.
సరేనని విద్యలు గ్రహించి.. మిత్రుని వద్దకు వెళ్లాడు మదనాంకుడు. మర్కట రూపంలో ఉన్న చంద్రస్వామిని కలుసుకుని..
“మిత్రమా! నేను అదృష్టవంతుణ్ని. రాగవతి ఎంతో మంచిది. లేకపోతే నాకు విద్యలు ఉపదేశించదు కదా! నీ విషయం కూడా చెప్పాను. పాపం చాలా జాలిపడింది కూడా” అన్నాడు.
చంద్రస్వామి మాత్రం..
“మదనాంకా! స్త్రీల చిత్తాలు క్షణక్షణానికీ మారిపోతుంటాయి. ముఖ్యంగా ఇటువంటి సంబంధం పెట్టుకున్నప్పుడు, మనం ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది” అని చెప్పాడు.
ఆ తరువాత వారిద్దరూ వేరే కబుర్లలో పడ్డారు.
మదనాంకుడు అక్కడికి వెళ్లిననాటి సాయంకాలం.. రాగవతి తలంటుకుని, గున్నమామిడి చెట్టుకింద తలారబోసుకుంటున్నది. ఆ సమయంలో రాజభంజరుడనే విద్యాధరుడు అటుపక్కగా వచ్చాడు. అతణ్ని చూడగానే సిగ్గుతో పక్కకు తప్పుకోబోయింది రాగవతి. కానీ, ఆ విద్యాధరుడు ఆమెను అటకాయించాడు.
“రాగవతీ! నువ్వేదో మానవుణ్ని వలచావని విన్నాను. ఆమాత్రం సుందరులు నీకు మన జాతిలో లభించలేదా?” అని ప్రశ్నించాడు.
“నిన్ను చూశాక తప్పు చేశానని అర్థమవుతున్నది. నువ్వు నన్ను చేపడితే, అతణ్ని విడిచిపెట్టేస్తాను” అన్నది రాగవతి సిగ్గుపడుతూ..
విద్యాధరుడు వెంటనే అంగీకరించాడు. అలా వాళ్లిద్దరూ ఒక్కటైపోయారు. ఆ మరునాడు చంద్రస్వామి వద్దనుంచి మదనాంకుడు వచ్చేశాడు.
రాగవతి తలుపు తీయలేదు. లోపలినుంచే..
“వచ్చినదారినే వెళ్లిపో!” అన్న హెచ్చరిక చేసింది.
ఆ మాటతో మదనాంకుడు మ్రాన్పడిపోయాడు. కొద్దిసేపు ఆగిన తరువాత మళ్లీ తలుపు బాదాడు. విద్యాధరునితో వినోదిస్తున్న రాగవతి విసుక్కుంటూ లేచి వచ్చింది.
తలుపు తీసి, మదనాంకుణ్ని ఈడ్చి తన్నింది.
“ధూర్తమానవా! చెబుతుంటే నీక్కాదూ?! పో ఇక్కణ్నుంచి. అధికప్రసంగం చేశావంటే శపించగలను. నీకిచ్చిన విద్యలు రేపటివరకు పనిచేస్తాయి. ఈలోపుగా మీ ఊరికి చేరుకుని, సుఖంగా ఉండు” అని చెప్పి, మళ్లీ లోపలికి పోయింది.
‘స్త్రీల చిత్తాలు క్షణక్షణానికీ మారిపోతుంటాయి!’ అని చంద్రస్వామి చెప్పిన మాట నెమరేసుకుంటూ.. మదనాంకుడు విచారంగా అక్కణ్నుంచి వెనుతిరిగాడు.
చంద్రస్వామి వద్దకు వచ్చి బోరున విలపించాడు.
“మిత్రమా! నువ్వు చెప్పిందే నిజమైంది. దీనికోసం కన్నతల్లిని, కట్టుకున్న భార్యను కూడా విడిచిపెట్టి వచ్చాను” అన్నాడు.
“అయ్యయ్యో! నీకు భార్య ఉందా?! నువ్వింకా నాలాగా పెళ్లికాని వాడివే అనుకున్నాను. స్త్రీ సాంగత్యం ఎటువంటిదో తెలిసి ఉండి కూడా ఇటువంటి అనుభవాన్ని ఎందుకు కోరుకున్నావు?” అని ప్రశ్నించాడు చంద్రస్వామి.
“ఎందుకంటే ఏమని చెప్పను?! ఆ సమయంలో నా కళ్లుమూసుకు పోయాయి. నా భార్య నల్లటిది. అందగత్తె కాదు. ఈ రాగవతి అందానికి మురిసి మూర్ఛపోయాను. ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడినయ్యాను” అని విచారం వ్యక్తంచేశాడు మదనాంకుడు.
“సరే.. ఇప్పటికైనా ఇంటికి పోదాం” అన్నాడు చంద్రస్వామి.
“ముందుగా నీ రూపం మార్చాలి. పద.. ఈ విద్యలు నాకు రేపటికల్లా పనికిరాకుండా పోతాయి. ఆలోపుగా ఇక్కణ్నుంచి వీలైనంత దూరం వెళ్లిపోదాం” అన్నాడు మదనాంకుడు.
వాళ్లిద్దరూ హిమాలయాల నుంచి మధురాపురం దిశగా ఆకాశమార్గంలో కొంతదూరం ప్రయాణించారు. విద్యలు అంతరించిన తరువాత కాలినడక సాగించారు.
కొన్నినెలల ప్రయాణం తరువాత మధురాపురంలో ప్రియంవద అత్తవారింటికి వెళ్లారు.
“మేము కాశీనుంచి వచ్చాం. వరాహదత్తుల వారిని, ప్రియంవదను కలుసుకోవాలి. శ్రీగర్భులవారు పంపిన వర్తమానం తెలియచేయాలి” అని పరిచారకునితో చెప్పారు.
“వరాహదత్తుడు చనిపోయి ఎనిమిదేళ్లయింది. ప్రియంవద చనిపోయి కూడా ఆరునెలలు దాటిపోయింది” అని చెప్పాడు పరిచారకుడు.
ఆ మాటతో విస్తుపోయారు స్నేహితులిద్దరూ. చేసేదేమీ లేక ఇద్దరూ కాశీనగరానికి ప్రయాణమయ్యారు.
మరికొన్నినెలల కాలం తరువాత కాశీకి చేరుకోగలిగారు. చంద్రస్వామి చెప్పిన గుర్తుల ప్రకారం ప్రియంవద వద్ద పనిచేసిన దూతిక ఇంటికి వెళ్లారు.
ఆమె వీరిని చూసి ఆశ్చర్యపోయింది.
“ప్రియంవద ఎలా చనిపోయింది?” అని ఆదుర్దాగా ప్రశ్నించాడు చంద్రస్వామి.
“అది తెలియాలంటే ఆమె కథంతా చెప్పాలి” అంటూ కథ చెప్పడం మొదలుపెట్టింది దూతిక.
ప్రియంవద కాపరానికి వెళ్లిన తరువాత కొంతకాలం బాగానే నడుచుకుంది. ఇంతలో సోదరుడి వివాహం జరుగుతుంటే మళ్లీ కాశీకి వచ్చింది. అలా వచ్చిన ప్రియంవద మళ్లీ అత్తవారింటికి పోలేదు. భర్త ఎన్నిసార్లు కబురు చేసినా, ఆరోగ్యం బాగోలేదని సమాధానం చెబుతూ వచ్చింది. అసలు సంగతేంటో కనుక్కోమని వరాహదత్తుడు తన స్నేహితుడైన లంపటుడనే వాణ్ని పంపాడు. అతను వచ్చేసరికి మరింత అనారోగ్యం నటించసాగింది.
“అన్నయ్యా! నీ దగ్గర సిగ్గుపడటం ఎందుకు?! నా అనారోగ్యం గురించి బాగా తెలిసిన వైద్యుడిక్కడ ఉన్నాడు. ఆయన నా రోగం తగ్గాలంటే దాంపత్యసుఖానికి దూరంగా ఉండాలని చెబుతున్నాడు. నేనక్కడికి వస్తే నీ స్నేహితుడు నన్ను విడిచిపెడతాడా!? అందుకే నేను రావడం లేదు. మరేమీ కారణం లేదు” అన్నది.
అందుకు లంపటుడు తెలివిగా..
“మంచిదే కానీ అమ్మాయీ! మగవాణ్ని ఎక్కువకాలం ఒంటరిగా వదిలేయడం మంచిది కాదు. భార్యను మరిచి ఇతర స్త్రీలను మరిగితే మళ్లీ దారికి తెచ్చుకోవడం కష్టం. ఇప్పటికే మీ ఆయన ఒక వేశ్యకు కన్నెరికం చేశాడు. రాత్రీపగలూ దానిదగ్గరే ఉంటున్నాడు” అని భయపెట్టి ఆమెను ఇంటికి తిరిగి తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు. కానీ ప్రియంవద తగ్గలేదు.
“ఈ మాట విన్నాక నాకింకా సంతోషంగా ఉందన్నయ్యా! తుమ్మెద ఎన్ని పువ్వులమీదైనా వాలవచ్చు. ఆయన సుఖపడుతున్నాడంటే నాకు ఆనందమే. నా మనసులో బాధ తగ్గింది” అన్నది.
ఆమె మాటలు విని లంపటుడు విస్తుపోయాడు. మాటలతో కాపరానికి రాదని అర్థమై వెనుతిరిగాడు.
“బావమరిది పెళ్లికి వెళ్లినవాడివి.. నీ పెళ్లాన్ని వెంటనే వెంట తెచ్చుకోకపోవడం నీదే తప్పు. నా అనుమానం నిజమైతే మీ ఆవిడ వైద్యుడితో సంబంధం పెట్టుకుంది. ఇక నీకు దక్కదు” అని వరాహదత్తుడికి చెప్పాడు.
ఆ వర్తమానం విన్న వరాహదత్తుడికి క్రోధం ముంచుకొచ్చింది. ఈసారి తానే స్వయంగా వచ్చి, ప్రియంవదను బలవంతంగా తనవెంట తీసుకుపోయాడు.
అడవిమార్గం గుండా వెళ్తుండగా ఒకచోట పల్లకి ఆపించాడు. సేవకులందర్నీ దూరంగా పంపించేశాడు. ఒక చురకత్తితో భార్య ముక్కుచెవులు కోసేయాలని ముందుకొచ్చాడు. అంతటి రౌద్రంలోనూ అతనికి భార్యమొహం చూడగానే మోహపు తెర కమ్మింది. కత్తి పక్కన పారేసి శృంగారం మొదలుపెట్టాడు. ప్రియంవద అరిచి గోలపెట్టింది.
“కత్తితో కాకుండా నన్ను ఇలా చంపాలని ప్రయత్నిస్తున్నావు” అంటూ అతనికి సహకరించకుండా పెనుగులాడ సాగింది.
“నేను నిన్నేమీ చేయను” అని వరాహదత్తుడు ఎంతో బతిమాలినా వినిపించుకోలేదు.
“ఒక పని చెయ్యి. నీ చేతులు, కాళ్లు కట్టివేస్తాను. నిన్ను పురుషాయిత క్రీడలో మెప్పిస్తాను. అప్పుడే నిన్ను నమ్మగలను” అన్నది ప్రియంవద.
“ఎలాగోలా ముచ్చట తీరితే చాలు” అన్నాడు వరాహదత్తుడు.
అతణ్ని బంధించిన ప్రియంవద.. నిర్దయగా అతని ముక్కుచెవులు కోసేసింది. అతని దుస్తులు తాను ధరించి, పురుషవేషంలో గుర్రాన్నెక్కి ఎటో వెళ్లిపోయింది. ఆ తరువాత వరాహదత్తుణ్ని ఎవరో ఆటవికులు కాపాడారు. ఎలాగో మధురాపురం చేరుకున్నాడు. ముక్కు చెవులు కోసేసినప్పుడు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ గాయాలనుంచి అతను చాలాకాలం కోలుకోలేకపోయాడు.
ఈలోపుగా ప్రియంవద ఎక్కడెక్కడో తిరిగింది. యథేచ్ఛగా కోరుకున్న మగవాళ్లతో గడిపింది. చివరికి ఆమె గర్భవతి అయింది. ఒకనాడు ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.
“నీ మగడు నిన్ను ఒంటరిగా ఎలా పంపించాడు?! మాకు చెపితే మేమైనా పల్లకి పంపించేవాళ్లం కదా!” అన్నారు.
‘హమ్మయ్య. నా సంగతి వీళ్లకింకా పూర్తిగా తెలీదు’ అనుకుంది ప్రియంవద.
పుట్టింట్లో పురుడు పోసుకుంది. పండంటి మగబిడ్డను కన్నది. పిల్లవాడు పుట్టిన విషయం తన తండ్రి వరాహదత్తునికి తెలియచేయకుండా రెండేళ్లవరకు అనేక పన్నాగాలు పన్ని అడ్డుకుంది. ఆ తరువాత మెల్లిగా గుసగుసలు మొదలయ్యాయి. అప్పుడు తనతో సంబంధం ఉన్న వైద్యుణ్ని మధురాపురం పంపింది. వరాహదత్తుడు మరణశయ్యమీద ఉన్నాడని వైద్యుడు సమాచారం ఇచ్చాడు. దాంతో మళ్లీ అత్తవారింటికి బయల్దేరింది. నేరుగా లంపటుడి ఇంటికి వెళ్లి, తన కొడుకును చూపించింది.
“అన్నయ్యా! నీ చెల్లినే అనుకుని, నేను చేసిన పనులన్నీ క్షమించు. ఎంతకాదనుకున్నా వీడు నీ స్నేహితుడికి క్షేత్రజుడు అవుతాడు. ఆయన ఆస్తి ఎవరెవరికో పోవడం కంటే వీడికి దక్కడమే న్యాయం కదా! నువ్వే న్యాయంగా ఆలోచించి చెప్పు” అని దీనాలాపాలు చేసింది.
లంపటుడు ఆమె మాటలు నిజమేననుకున్నాడు. అప్పటికే వరాహదత్తుడు వీలునామా రాసినా సంతకం చేయలేదు. లంపటుడు దానిని ప్రియంవద కొడుకు పేరుమీదికి మార్చివేశాడు.
మరణశయ్యమీద ఉన్నందువల్ల భార్య వచ్చినా, ఆమెనేమీ అనలేని స్థితిలో ఉన్నాడు వరాహదత్తుడు. ఆరోజే ప్రాణాలు విడిచాడు. దాంతో కోట్లవిలువైన ఆస్తిపాస్తులు ఆమె చేతిలోకి వచ్చిపడ్డాయి. ఆ తరువాత ఆమె ఆడింది ఆట, పాడింది పాట అయిపోయింది. దాంతో అనేక రోగాలు చుట్టుముట్టాయి. వాటితోనే ఆరునెలల కిందట చనిపోయింది. ఈ విషయాలన్నీ తెలిసిన తరువాత ఆమె కొడుకును శ్రీగర్భుడు దగ్గరికి చేరనీయలేదు. లంపటుడు అతణ్ని కాపాడాడు.
అంటూ ముగించింది దూతిక.
..ఆ కథంతా విన్నతరువాత చంద్రస్వామి, మదనాంకుడు కన్నీరు కార్చారు.
కొంతసేపటి తరువాత..
“ఇంతకూ దూతికా! అప్పుడు యోగిని ఇచ్చిన మూలిక నీ దగ్గరుందా?” అని ప్రశ్నించాడు మదనాంకుడు.
“నా దగ్గరలేదు. నేను, ప్రియంవద దానిసంగతే మరిచిపోయాం” అని సమాధానమిచ్చింది దూతిక.
“అయితే ఇప్పుడెలా? ఇతనింక ఈ కోతిరూపంలో ఉండిపోవాల్సిందేనా?” అడిగాడు మదనాంకుడు.
“ఆ యోగిని ప్రస్తుతం కాశీలో లేదు. ఎక్కడికో యాత్రలకు వెళ్లింది. కొద్దిరోజులు ఓపిక పడితే వస్తుంది. ఆమె వచ్చేదాకా వేచి ఉండటం మినహా మార్గం లేదు” అని జవాబిచ్చింది దూతిక.
“మిత్రమా! నా కోసం అంతకాలం నువ్వు ఇక్కడే ఉండటం ఎందుకు. నువ్వు ఇంటికి వెళ్లు. నీ వాళ్లను చూసుకో” అన్నాడు చంద్రస్వామి.
(వచ్చేవారం.. బంగారు ఎలుక)