సుబేదారి, మే 10: భూసేకరణ (ల్యాండ్ పూలింగ్)పై రైతులు ఆందోళన చెందొద్దు, సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు పక్షపాతి, రైతు రాజ్యం రావాలన్నదే ఆయన తపన అని పరకాల ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ నగరం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ విధానంపై మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఆయన నివాసంలో మాట్లాడారు. భూసేకరణ అనేది భూ యజమాని స్వచ్ఛంద భాగస్వామ్యంతో చేపట్టే కార్యక్రమమని, ప్రభుత్వం ఏకపక్షంగా రైతుల భూములను తీసుకోదని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. ల్యాండ్ పూలింగ్ విధానంపై కొందరు ఉద్దేశపూర్వకంగానే రైతులను తప్పదోవ పట్టించి ఆందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. వారి మాటలు రైతులు నమ్మొద్దని ఎమ్మెల్యే రైతులను కోరారు. ల్యాండ్ పూలింగ్పై ఇప్పటికే పాలుమార్లు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు, కుడా వైస్ చైర్పర్సన్, సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారని, మరోసారి బుధవారం రెండు జిల్లాల కలెక్టర్లు, అధికారులు సమావేశం కానున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
రైతులకు అన్యాయం చేసే ఆలోచన రాష్ట్ర పభుత్వానికి లేదని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఎడారిగా మారి సాగునీరులేక భూములు బీడుగా మారాయని, గత పాలకులు వ్యవసాయం దండగ అన్నారని, స్వరాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పండుగలా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని ఎమ్మెల్యే కోరారు. ల్యాండ్ పూలింగ్ విధానంతో నిజంగా నష్టం, అన్యాయం జరిగితే రైతు కష్టాలు తెలిసిన రైతు బిడ్డగా తానే రైతుల పక్షాన మొదట నిలబడుతానని పేర్కొన్నారు.