T Congress | హైదరాబాద్, మే 4(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలును ‘ఎన్నికల కోడ్’ పేరుతో కాంగ్రెస్ అటకెక్కించేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేయలేక చేతులెత్తేసిన ప్రభుత్వం ఇప్పుడు కోడ్ పేరు చెప్పి ప్రజా వ్యతిరేకతను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది.
హామీలను అమలుచేయాలని అనుకున్నా కోడ్ అడ్డం రావడంతో ఏమీ చేయలేకపోతున్నామని చెప్తున్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నా యి. ఎన్నికల కోడ్ రావడానికి ముందే వంద రోజులు పూర్తయినా ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
భారమయ్యే వాటిని బంద్ పెట్టి
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మొత్తం 13 హామీలున్నాయి. వీటిలో ఇప్పటి వరకు అమలుచేసింది నాలుగింటినే. అవికూడా ఆర్థికంగా భారంకాని వాటిని మాత్రమే అమలుచేసింది. వాటిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ రూ. 10 లక్షలకు పెంపు ఉన్నాయి.
కోడ్ రావడానికి రెండు రోజుల ముందు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించినా ఆ తర్వాత నిలిపివేసింది. ఇలా చిన్నచిన్న హామీలను అమలుచేసిన కాంగ్రెస్ ప్రభు త్వం రైతులు, మహిళలకు సంబంధించి ప్రధానమైన హామీలను గాలికి వదిలేసింది. మహిళలకు రూ. 2500, రైతు భరోసా కింద రూ. 15 వేలు, వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ వంటి హామీలను అమలుచేయలేకపోయింది.
అతీగతీలేని రుణమాఫీ
డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్న రేవంత్రెడ్డి ప్రకటన అతీగతీ లేకుండా పోయింది. బోనస్ రాక, రైతుబంధు లేక, పంటబీమా, పంట నష్టపరిహారం రాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు అందించలేదు. దీనికి కూడా కోడ్నే సాకుగా చెప్తున్నది.
మహిళలకు రూ. 2500
మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ప్రతి మహిళకు నెలకు రూ. 2500 బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. వాస్తవానికి ఇచ్చిన హామీ ప్రకారం మార్చి 16వ తేదీ నాటికే అమలు చేయాలి. అయినా దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
రైతుభరోసా రూ. 15వేలు
కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ఏటా రూ. 10వేల పెట్టుబడి సాయం అందిస్తే, ఈ పథకం పేరును రైతుభరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రతి ఎకరానికి ఏటా రూ. 15 వేల పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం ఈ యాసంగి సీజన్లో 15 వేల పెట్టుబడి సాయం రైతులకు అందాలి. రూ. 15వేల సంగతి దేవుడెరుగు. పాత రూ. 10వేలు కూడా ఇప్పటికీ రాలేదు. పంట వేసేటప్పుడు రావాల్సిన సాయం కోతలు పూర్తవుతున్నా అందకపోవడంతో రైతుభరోసా అమలవుతుందో లేదోనన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తున్నది. కౌలు రైతులకు కూడా రూ. 15వేల పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చినా దానికీ దిక్కులేదు.
ఇందిరమ్మ ఇండ్లు.. రూ. 5 లక్షలు
100 రోజుల్లో అమలు చేస్తామంటూ చెప్పిన ఆరు గ్యారంటీలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ఒకటి. ఇంటి స్థలం ఉన్నవారికి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, స్థలం లేనివారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఈ పథకాన్ని ఎన్నికల కోడ్ రావడానికి రెండు రోజుల ముందు అమలు చేస్తున్నట్టు ప్రకటించినా విధివిధానాలు ప్రకటించలేదు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు.
వరికి రూ. 500 బోనస్
రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన మరో హామీ వరికి క్వింటాకు రూ. 500 బోనస్. ఈ హామీ మొన్నటి వానకాలం పంటకే అమలు కావాలి. తాము ఇప్పుడే అధికారంలోకి వచ్చామని, యాసంగి సీజన్ నుంచి అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. చివరికి యాసంగిలోనూ అమలుకు నోచుకోలేకపోయింది. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాగుతున్నా బోనస్ ఊసులేదు.
పెన్షన్ రూ.4వేలు
ఆరు గ్యారెంటీల్లో భాగంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్ను రూ.4వేలకు పెంచుతామని చేయూత పథకాన్ని ప్రకటించారు. 100 రోజు ల్లో అమలు చేయాల్సిన ఈ పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. కనీసం దీనికి సంబంధించి కార్యాచరణ కూడా మొదలుపెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతు లు, మ హిళలు, వృద్ధులు సహా అన్ని వర్గాలను మోసం చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.