హనుమకొండ/సుబేదారి, మే 6: దాదాపు నెల నుంచి ‘రైతు సంఘర్షణ’ అంటూ కాంగ్రెస్ నేతలు హడావుడి చేశారు.. రాహుల్తో సభ పెట్టించి పబ్బం గడుపుకొందామనుకున్నారు. రాహుల్ సభ అంటే ఆయన ఏం మాట్లాడుతారోనని పార్టీ శ్రేణులు ఆతృతగా ఎదురు చూశారు.. శుక్రవారం సాయంత్రం వరంగల్ పర్యటన కోసం హైదరాబాద్కు వచ్చీరాగానే రాహుల్గాంధీ పార్టీ నాయకులతో కాసేపు భేటీ అయి ‘హా.. చెప్పండి.. సభ థీం ఏంటి.. రమ్మంటే వచ్చాను.. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి.. సభ ఎందుకు నిర్వహిస్తున్నారు’ అని అడుగగానే అక్కడున్నవాళ్లు నోరెళ్లబెట్టారు.. ఈ వీడియో శుక్రవారం సాయంత్రం నుంచే వైరల్ కాగా పార్టీ శ్రేణులూ విస్తుపోయారు.. ఆద్యంతం టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రోలే కనిపించిన ఈ కార్యక్రమంలో ‘రైతు సంఘర్షణ’ ఏమోగాని, రేవంత్ ఆధిపత్య సంఘర్షణే కనిపించిందని పలువురు రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్నే రాహుల్ గాంధీ చదివి వినిపించారు. ఆయన సభలో మాట్లాడుతుండగా ప్రజలు తిరుగుపయనమవడం కనిపించింది.
హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం సామర్థ్యం చిన్నదే అయినా కాంగ్రెస్ సభకు వచ్చిన జనాలతో నిండలేదని పలువురు చర్చించుకోవడం కనిపించింది. రైతుల పేరుతో సభ నిర్వహించినా అందులో రైతులే కనిపించలేదని, మొత్తం యువతనే సభకు తోలుకొచ్చారని అక్కడున్నవాళ్లు మాట్లాడుకోవడం కనిపించింది. తెలంగాణపై ఏమాత్రం అవగాహన లేకుండా కాంగ్రెస్ జాతీయ నేత ఇక్కడి రావడం ఏంటని.. ఇది తెలంగాణపై పూర్తిగా చిన్నచూపేనని, సభ ఎందుకు నిర్వహిస్తున్నారో కూడా తెలియకుండా సోనియా తనయుడు రావడం ఏమిటని ముక్కున వేలేసుకున్నారు.
ఫ్లెక్సీల పేరుతో కొట్టుకున్న కాంగ్రెస్ వర్గాలు
రాహుల్ సభ నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఆ పార్టీకి చెందిన జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి అనుచరులు ఫ్లెక్సీల విషయంలో గొడవపడి కొట్టుకున్నారు. రాఘవరెడ్డి అనుచరుడిపై నాయిని అనుచరులు మరణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున హనుమకొండ నక్కల గుట్ట అదాలత్ జంక్షన్ వద్ద జరిగింది. దాడిలో త్రీవంగా గాయడ్డ బాధితుడు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, నాయిని రాజేందర్రెడ్డి అనుచరులు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగా రాఘవరెడ్డి ప్రధాన అనుచరుడు, టేకులగూడేనికి చెందిన టీ జగదీశ్వర్రెడ్డి, జయరాజు ఇద్దరు రాహుల్ సభ కోసం నగరంలోని ప్రధాన రోడ్ల వెంట ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ క్రమంలో నాయిని అనుచరుడు, యూత్ కాంగ్రెస్ నాయకుడు రెపల్లె రంగనాథ్, జగదీశ్వర్రెడ్డికి శుక్రవారం రాత్రి ఒంటిగంట సమయంలో ఫోన్చేసి నక్కలగుట్ట అదాలత్ జంక్షన్కు రావాలని, ఇక్కడ మీరు పెట్టిన ఫ్లెక్సీ పడిపోయిందని చెప్పాడు. దీంతో ఇద్దరూ అక్కడికి వచ్చారు. జగదీశ్వర్రెడ్డి, జయరాజు అక్కడికి చేరుకొని ఫ్లెక్సీని సరిచేస్తుండగా ఇంతలో స్కూటీ, కారులో ఆరుగురు వ్యక్తులు వచ్చి ‘మా అన్న కంటే ఎక్కువ ఫ్లెక్సీలు కడుతున్నారు. చంపుతాం బిడ్డ’ అని మారణాయుధాలతో బెదిరిస్తూ జగదీశ్వర్రెడ్డి మూతిపై, తలపై తీవ్రంగా కొట్టారు. దీంతో అతడి మూడు పళ్లు ఊడిపోయి, తలకు తీవ్రగాయమైంది. అతడితో ఉన్న జయరాజును సైతం కొట్టారు. జగదీశ్వర్రెడ్డి వద్ద ఉన్న ఫోన్, రూ. 45 వేల నగదు గుంజుకొని పరారయ్యారు. ఈ ఘటనపై జగదీశ్వర్రెడ్డి ఫిర్యాదు చేయగా నాయిని అనుచరులు రెపల్లె రంగనాథ్తోపాటుగా మరో ఐదుగురిపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు.