హనుమకొండ, మే 6 : కాంగ్రెస్ నాయకులు చెప్పే అబద్ధపు మాటలను ప్రజలు ఎవరూ నమ్మరని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో రుణమాఫీ చేస్తున్నారా అని రాహుల్గాంధీని ప్రశ్నించారు. శుక్రవారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై హనుమకొండ రాంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో రాత్రి విలేకరులతో మాట్లాడారు. ‘మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు, రైతుబీమా ఎందుకు ఇవ్వలేదు’ అని ప్ర శ్నించారు. కాంగ్రెస్ అధికారంలో సమయంలో అనేక మార్లు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతు రుణమాఫీ చేస్తున్నారా అని ప్రశ్నించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనకపోవడం వల్లే తెలంగాణకు తెచ్చి అమ్ముకుంటున్నారని చెప్పారు.
చెరుకు పరిశ్రమలను మూసివేసిన మీరే మళ్లీ మూతపడ్డ చెరుకు పరిశ్రమను తెరుస్తామనడం సిగ్గుచేటన్నారు. పసుపు బోర్డు తెస్తానంటున్న మీరు ఏ ఒక్క రోజైనా పార్లమెంట్లో పసుపు బోర్డు గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తితే కనీసం మద్దుతు కూడా తెలుపలేదని మండిపడ్డారు. పోడుభూముల సమస్య ఉత్పన్నమైంది కాంగ్రెస్ పాలనలోనేనని, అప్పుడే ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు పుట్టింది కూడా కాంగ్రెస్ పాలనలోనేనని, నకిలీ విత్తనాల విషయంలో తెలంగాణలో చట్టం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. రైతు సంఘర్షణ సభ మరోసారి రైతులను మోసం చేసేందుకే పెట్టిన సభ అని ఎద్దేవా చేశారు. ‘మీరు వచ్చి కాళ్లు పట్టుకున్నా ఎవ్వరూ మీతో పొత్తు పెట్టుకొనేందుకు సిద్ధంగా లేరు’ అని కుండబద్దలు కొట్టారు.
తెలంగాణకు స్వాతం త్రం తెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో బలిదానాలకు కాంగ్రెస్సే కారణమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడైనా 24 గంటల ఉచిత కరంట్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలోనే రైతు ల ఆత్మహత్యలు జరిగాయని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ సమర్థుడైతే తాను పోటీచేసిన నియోజకవర్గంలో ఎందుకు గెలువలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ వరంగల్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, తమ కార్యకర్తల స్థాయిలో కూడా ఆ సభ లేదన్నారు. రేవంత్ రెడ్డి మాటలను ఎవరూ నమ్మరన్నారు. కాంగ్రెస్లో కోవర్టులు ఉన్నారని స్వయంగా రాహుల్గాంధీయే ఒప్పుకున్నారని మంత్రి అన్నారు. రైతు డిక్లరేషన్ను రాహుల్గాంధీ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకించడం వల్ల బీజేపీతో తగాదా మొదలైందని, కాంగ్రెస్ తమకు పోటీయే కాదని, ఆ పార్టీ రాష్ట్రంలో ఏనాడో చచ్చు పడిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్వి మోసపు, బోగస్ హామీలని, 70 ఏండ్ల పాటు రైతులను మోసం చేసిన కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి స్పష్టం చేశారు.