హనుమకొండ సబర్బన్, ఏప్రిల్ 3 : పూర్వం వ్యవసాయాన్ని మొత్తం ప్రకృతే నడిపించేది. రసాయన ఎరువులు, పురుగు మందుల అవసరం పడకపోయేది. పంటలను నాశనం చేసేందుకు శాకాహార పురుగులు వస్తే వాటిని భుజించేందుకు మంసాహార పురుగులు కూడా పెద్ద ఎత్తున వచ్చేవి. దీంతో ప్రకృతి సమతుల్యత ఉండేది. భూమిలో సారం పెంచే విషయంలో సైతం ప్రకృతి ప్రసాదించిన ప్రాణులే పుడమికి జీవం పోసేవి. అతి తక్కువ పెట్టుబడితో నష్టం అనేది లేకుండా రైతులకు పంట చేతికొచ్చేది. ఇలా సాగిపోతున్న తరుణంలో దిగుబడులు పెంచే నెపంతో రసాయన ఎరువులు, పురుగు మందులు సేద్యపు ప్రక్రియలో చొరబడ్డాయి. ఇవి పంటకు ఊపిరి పోసి అన్నదాతలకు అండగా ఉండే మిత్ర పురుగులపై పెను ప్రభావం చూపుతున్నాయి. ఏటేటా మిత్ర పురుగుల మనుగడ కష్టంగా మారుతున్నది. పంటలను నాశనం చేసే పురుగులను సంహరించేందుకు రైతులకు ఇంకా పెద్ద ఎత్తున పురుగుల మందులు పిచికారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మిత్ర పురుగులకు ఇది మరింత ప్రమాదకరంగా మారింది. ఇప్పటికైనా రైతులు మేల్కొని విచ్చల విడి పురుగుమందుల వినియోగానికి ఫుల్స్టాప్ పెట్టకపోతే భవిష్యత్లో రైతులు భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పంట పొలాల్లో కనిపించే ప్రతి పురుగుపై రైతులు అవగాహన పెంచుకోవాలని, ఆ పురుగు పంటకు నష్టం చేస్తుందా? లేక లాభం చేస్తుందా? అనే విషయంలో స్పష్టత తెచ్చుకొని మేలు చేసే పురుగులను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
రైతులకు మేలు చేసే పురుగులు..
ఎన్నో పురుగులు రైతులకు సహాయకారిగా ఉన్నాయి. పంటను రక్షించుకునే ప్రయత్నంలో రైతులు విచ్చలవిడిగా రసాయన మందులు వాడుతుండడంతో పంటలకు మేలు చేసే లక్షలాది పురుగులు చనిపోతున్నాయి. ఇటీవల కొందరు రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ భూమికి తిరిగి సత్తువ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులంతా ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లితే నాణ్యమైన దిగుబడులను సాధించవచ్చు.
ఆక్షింతల పురుగు (లేడీ బర్డ్ బీటిల్స్) : ఇవి కుంభాకారంలో చిన్నగా ఉండి లేత రంగులో ఉంటాయి. పైన తాబేలు చిప్పలా ఉండి నల్లని మచ్చలు కనిపిస్తాయి. ఇవి పంటలో పేనుబంక, తెల్లబంక పురుగులు, గుడ్లను, లార్వాలను తింటాయి. తామర పురుగులను కూడా సంహరిస్తాయి.
కందిరీగలు : ఇవి మొక్కల్లో పరపరాగ సంపర్కానికి ఉపయోగపడుతాయి. తద్వారా ఫలదీకరణ బాగా జరిగి పంట దిగుబడి పెరిగేందుకు దోహద పడుతాయి. ఆకుల కింది భాగాన ఉండే గుడ్లను తినడంతో పాటు లద్దె పురుగును ఆరగిస్తుంది.
గ్రౌండ్ బీటిల్స్ : ఈ పురుగులు గోధుమ, నలుపు రంగులో ఉంటాయి. ఇవి కర్ర శిథిలాలు, రాళ్ల కింద ఉంటూ రాత్రి పూట బయటకు వచ్చి లద్దె పురుగులను, నల్లి గుడ్లను ఇతర పురుగులను తింటాయి.
గొల్ల భామలు (ప్రేయింగ్ మాన్టిడ్) : ఇది ఆకుపచ్చ రంగులో ఉండి కనిపించకుండా ఆకుల్లో కలిసిపోయి ఉంటుంది. ముందు కాళ్ల సాయంతో శనగ పచ్చ, లద్దె పురుగులను తిని పంటలకు మేలు చేస్తుంది.
గ్రీన్లెస్ వింగ్ : ఇవి లేత ఆకుపచ్చ, గోధుమ రంగులో ఉండి పొడవైన రెక్కలతో ఉంటాయి. అఫిడ్స్, త్రిప్స్ను తింటాయి. ఎదిగిన లార్వాలను రోజూ వందకు పైగానే తింటాయి.
వానపాములు (ఎర్రలు) : పంటకు అతి ఎక్కువ బలాన్ని ఈ వానపాములు చేకూర్చుతాయి. ఇవి భూమి లోపల ఉండి మట్టిని తింటూ విసర్జిస్తాయి. దీంతో భూమి గుల్ల బారుతుంది. భూమి మొత్తం అత్యంత సారవంతంగా మారి పంటకు బలంగా ఉంటుంది.
డ్రాగన్ ఫ్లై (తూనీగ) : వందలాదిగా ఉండే తూనీగలు ఎగిరే కీటకాలను వేటాడుతాయి. మంచి దూర దృష్టి కలిగిన ఈ తూనీగలు గాలిలో వేగంగా కదులుతూ తన పదునైన కాళ్లతో పురుగులను పట్టి తింటాయి. ముఖ్యంగా పంట చేల్లో ఉండే దోమలు, ఈగలను ఇష్టంగా తింటాయి.
సిల్ ఫీడ్ ఫెలస్ (ఫ్లవర్ పైస్) : ఇవి ముదురు రంగులో ఉండి అఫిడ్స్తో పాటు చెద పురుగులను తింటాయి.
లైటింగ్ బగ్స్ (తుమ్మెద) : ఇవి ఎండా కాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. కీటకాలను, నత్తలను తిని పంటలకు మేలు చేస్తాయి.
సాలె పురుగు (స్పైడర్) : ఇవి పంట మొక్కల్లో గూళ్లు పెట్టుకుని చిన్న పురుగులు, దోమలు, నల్లులు, రెక్కల పురుగులను తిని పంటను రక్షిస్తాయి.