హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 3: అంతరించిపోతున్న బాల్బ్యాడ్మింటన్ క్రీడను బతికించుకోవాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూస్టేడియంలో జరిగాయి. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పాల్గొని పోటీలను ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. అనంతరం రాత్రి జరిగిన ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొని అర్జున పిచ్చయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ అర్జున పిచ్చయ్య ద్వారా ఉమ్మడి వరంగల్లో బాల్బ్యాడ్మింటన్ ప్రాచూర్యం పొందిందన్నారు. అప్పట్లో వరంగల్లో పిచ్చయ్య స్పోర్ట్స్ షాపు ఉండేదని, బ్యాట్ కొనుక్కోవడానికి వచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. రూ.6.50 లక్షల సీడీఎఫ్ నిధులతో బాల్బ్యాడ్మింటన్ కోర్టుకు ఫ్లడ్లైట్స్ ఏర్పాటు చేసినట్లు, మరోవైపు కోర్టుకు కూడా ఫ్లడ్లైట్స్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని కోరారు. త్వరలో ఇక్కడ రాష్ట్ర, నేషనల్ మీట్ ఏర్పాటు చేయాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో మాట్లాడి బాల్బ్యాడ్మింటన్కు స్పోర్ట్స్కోటాలో అవకాశం కల్పించేలా కృషి చేస్తానన్నారు. క్రీడలను క్రీడా దృష్టితోనే చూడాలని, బాల్బ్యాడ్మింటన్ క్రీడకు గ్రామాల్లో క్రేజీ ఎక్కువగా ఉందని శ్రీహరి అన్నారు. నైపుణ్యం లేకుండా క్రీడల్లో రాణించలేమన్నారు. ఆటలకు పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి బీ వీరన్న మాట్లాడుతూ మొత్తం 12 జట్లు పోటీల్లో పాల్గొనగా నాలుగు లీగ్ల్లో లీగ్-కమ్ సూపర్ లీగ్ నిర్వహించినట్లు తెలిపారు. అందులో ఫైనల్స్ రంగారెడ్డి జిల్లా-వరంగల్ జట్లు తలపడగా 35-31 స్కోర్తో వరంగల్ జట్టు గెలుపొందింది. అలాగే, భూపాలపల్లి-హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో జాయింట్ విన్నర్స్గా రెండు జట్లు నిలిచాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రవీందర్గౌడ్, అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.