హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 2 : యాదాద్రి పుణ్యక్షేత్రానికి హనుమకొండ బస్స్టేషన్ నుంచి బస్సులను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు యాదాద్రి దర్శన్ ఎక్స్ప్రెస్ బస్సు సర్వీస్ను పోలీస్ కమిషనర్ తరుణ్జోషి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నర్సింహస్వామి దర్శనానికి ప్రయాణికులకు బస్సు సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఫిబ్రవరిలో జరిగిన మేడారం జాతరలో కూడా భక్తులకు అనుణంగా ఆర్టీసీ బస్సులను వివిధ పాయింట్ల నుంచి తిప్పి ప్రయాణికుల ఆదరణ ఎంతగానో పొందిందని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఎంతో సౌకర్యమని తెలిపారు. అనంతరం బస్సు టికెట్ తీసుకుని బస్సులో ప్రయాణించారు. అలాగే, మొదటి ప్రయాణికురాలికి టికెట్ అందజేశారు. రీజినల్ మేనేజర్ వీ శ్రీదేవి మాట్లాడుతూ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నర్సింహస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు యాదాద్రి దర్శన్ బస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. హనుమకొండ నుంచి యాదగిరిగుట్టకు పెద్దలకు రూ.130, పిల్లలకు రూ.70 బస్సు చార్జి ఉంటుందని తెలిపారు.
లక్కీ డిప్ విజేతలు..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 31 వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలు వారి టికెట్లను లక్కీడిప్ బాక్స్లో వేశారు. హనుమకొండ బస్స్టేషన్లో సీపీ తరుణ్జోషి లక్కీడ్రాను తీసి పేర్లను ప్రకటించారు. మొదటి బహుమతి సుష్మిత (జఫర్గఢ్ మండలం తిమ్మంపేట), రెండో బహుమతి రేణుక (రఘునాథపల్లి మండలం నారాయణపురం) మూడో బహుమతి జే సోమలక్ష్మి(సుబేదారి, హనుమకొండ) గెలుచుకున్నారు. కార్యక్రమంలో హనుమకొండ ఏసీపీ జితేందర్రెడ్డి, సీఐ వేణుగోపాల్, డివిజనల్ మేనేజర్ బీ రమేశ్, డిపో మేనేజర్లు వీ మోహన్రావు, కే భానుకిరణ్, సత్యనారాయణ, సూపర్వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.
విజేతల ఎంపిక..
వరంగల్ చౌరస్తా : మహిళా దినోత్స వాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి లక్కి డిప్ ఎంపికను శనివారం వరంగల్ బస్టాండ్లో నిర్వహించారు. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా బస్సుల్లో ప్రయాణించిన మహిళలు తాము తీసుకున్న టికెట్ వెనుకాల ఉన్న వివరాలను పూరించి ఏటూరునాగారం, ములుగు, హనుమకొండ బస్టాండ్లలో అధికారులు ఏర్పాటు చేసిన లక్కీ డిప్ బాక్సుల్లో వేశారు. ఈ మేరకు వారిలో విజేతలను ఎంపిక చేశారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి, డివిజనల్ మేనేజర్ రమేశ్, మోహన్రావు పాల్గొని హనుమకొండ నుంచి రాగసుధ, ఏటూరునాగారం నుంచి పీ భవాణి, ములుగు నుంచి స్వరూప ఎంపికయ్యారు. వారికి సర్ప్రైజ్ గిఫ్ట్తోపాటు ఏడాదిపాటు 30 కిలో మీటర్లలోపు సీజనల్ టికెట్లను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ డిపో మేనేజర్ భానుకిరణ్, స్టేషన్ సూపర్వైజర్ సీతయ్య పాల్గొన్నారు.