‘ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా.. సామాజికంగా సంపూర్ణ సాధికారత సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగ నిర్మాత బీ ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి దళిత కుటుంబం ఆర్థిక స్థిరత్వం పొందేందుకు ఈ పథకం దోహదం చేస్తుంది. దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న ఈ పథకం దేశంలోనే అత్యద్భుతం’ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అభివర్ణించారు. దళితబంధు పథకం అమలుపై ‘నమస్తే’కు శుక్రవారం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, పేదరికమే ప్రాతిపదికగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, దశలవారీగా అందరికీ మేలు జరుగుతుందని వివరించారు. – వరంగల్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా సంపూర్ణ సాధికారత సాధించాలనే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెలే అరూరి రమేశ్ అన్నారు. భారతదేశ చరిత్రలో దళితుల కోసం ఇలాంటి పథకాన్ని ఏ రాష్ట్రంలోగాని, ఏ ప్రభుత్వంగాని, ఏ ముఖ్యమంత్రిగాని ప్రవేశపెట్టలేదని స్పష్టం చేశారు. దళితబంధు పథకం అమలు తీరుపై ‘నమస్తే తెలంగాణ’కు శుక్రవారం ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణలోని ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం అందుతుందని చెప్పారు. ఇది పథకం మాత్రమే కాదని, దళితుల ఆర్థిక స్వావలంబన కోసం చేపట్టిన ఒక ఉద్యమమని అభివర్ణించారు. సీఎం కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత ఎమ్మెల్యేగా తనపై ఎక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా 100 కుటుంబాలకు అమలవుతుందని, దశలవారీగా అందరికీ అందుతుందని చెప్పారు. పేదరికమే ప్రాతిపదికగా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని వివరించారు. ఆ అంశాలు ఆయన మాటల్లోనే..
నమస్తే : దళితబంధుపై కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి కదా?
ఎమ్మెల్యే అరూరి : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కేసీఆర్ సాకా రం చేస్తున్నారు. దళితులు ప్రతిరంగంలో సాధికారత సాధించాలనేది అంబేద్కర్ ఆశయం. దీనికి అనుగుణంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తెచ్చారు. ఇన్నేండ్లలో కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు పని చేశాయి. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో కలిపి ఎన్నో రాజకీయ పార్టీలు పరిపాలన సాగించాయి. గొప్పవాళ్లు ముఖ్యమంత్రులుగా పని చేశారు. దళిత సమాజం గురించి సీఎం కేసీఆర్ పట్టించుకున్నట్లుగా ఎవరూ ఆలోచించలేదు. స్వతంత్ర భారత చరిత్రలోనే ఇలాంటి పథకాన్ని ఎవరూ, ఎక్కడా అమలు చేయలేదు. దళితబంధు పథకం దేశానికే దిక్సూచి లాంటిది.
దళిత సమాజానికి ఎలా ఉపయోపగడుతుంది.
దళితులు ఆర్థికంగా పటిష్టమైనప్పుడే ఈ వర్గాలపై ఉన్న వివక్ష శాశ్వతంగా దూరమవుతుందని సీఎం కేసీఆర్ భావించారు. దళితబంధు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తేనే దళితజాతి అభివృద్ధి జరుగుతుంది. దళితులను ఆర్థికంగానే కాకుండా సామాజిక వివక్ష నుంచి దూరం చేసి వారికి ఆత్మగౌరవాన్ని కల్పించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. దళితబంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల సాయంతో వారికి నైపుణ్యం, అవగాహన ఉన్న ఏదైనా పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని పెట్టుకోవచ్చు. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లతో దళితులు విద్యావంతులు, ఉద్యోగులు అయ్యారు. కేసీఆర్ పెట్టిన దళితబంధుతో దళితవర్గాలు వ్యాపార పరంగా సాధికారత సాధిస్తారు.
దళిత సమాజం పూర్తి సాధికారత సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. దళితబంధు పథకం అమలు సందర్భంగా మూడు దశలను పాటించాలని అందరికీ స్పష్టత ఇచ్చారు. దళితుల అసైన్డ్, గ్రామకంఠం తదితర భూముల సమస్యలను పరిష్కరించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. దళితవాడల్లో సంపూర్ణంగా మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. వీటితోపాటు దళితులు ఆర్థికంగా, వ్యాపార పరంగా రాణించేలా దళితబంధును అమలు చేయాలని నిర్ణయించారు.
అరూరి : వర్ధన్నపేట నియోజకవర్గంలో దళిత కుటుంబాలు ఎక్కువ. రాజ్యాంగ ప్రకారం ఇచ్చిన అవకాశంతో ఇక్కడ ఎమ్మెల్యే స్థానం దళితవర్గాలకు రిజర్వు అయ్యింది. దళితబంధు పథకం అమలుపై మిగిలిన వారి కంటే దళిత ఎమ్మెల్యేగా ఎక్కువ బాధ్యత నాపై ఉంటుందని భావిస్తున్నా. సీఎం కేసీఆర్ గొప్ప లక్ష్యంతో పెట్టిన దళితబంధు పథకంతో దళిత కుటుంబాలు ఆర్థికంగా సాధికారత సాధించాలి. దళితబంధుతో ఏది ఎంపిక చేసుకోవాలనేది పూర్తిగా లబ్ధిదారు ఇష్టం. వారు విజయవంతమయ్యేలా అవగాహన కల్పిస్తాం. వర్ధన్నపేట నియోజకవర్గంలో గ్రామీణ, నగర ప్రాంతాలు సమానంగా ఉంటాయి. వరంగల్ నగరం దగ్గరగా ఉండడం ఒక రకంగా అనుకూలమైన అంశం. రవాణా, ఉత్పత్తి రంగాల్లో కొందరు పెట్టబడి పెట్టేందుకు అవకాశాలుంటాయి. అన్ని అంశాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తాం. ఏది ఎంపిక చేసుకున్నా అందులో వారు సక్సెస్ అయ్యేలా అండగా ఉంటాం.
అరూరి : రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయనే అంచనా ఉంది. కచ్చితమైన సంఖ్య ఎంత ఉన్నా ప్రతి కుటుంబానికి దళితబంధు అమలు చేయాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. దశల వారీగా ప్రతి కుటుంబానికి పథకం అందుతుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 కుటుంబాలకు అమలు చేయాలని విధాన పరంగా నిర్ణయించారు. ఈ మేరకు వీరి ఎంపిక పూర్తయ్యింది. తొలిదశ తక్కువ మంది ఉండడం వల్ల ఎలాంటి యూనిట్లు విజయవంతమవుతాయో పరీక్షించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత వంద మంది లబ్ధిదారుల అనుభవాల ఆధారంగా తర్వాత దశలో చేపట్టే వేల మందికి పథకం సద్వినియోగమవుతుంది.
అరూరి : దళితబంధు పథకానికి పరిమితులు లేవు. యూనిట్ విలువ ఎక్కువ ఉంటే ఇద్దరు ముగ్గురు కలిసి అయినా పెట్టుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లోని మార్కెటింగ్ సామార్థ్యాన్ని పెట్టి యూనిట్ను ఎంపిక చేసుకోవచ్చు. పారిశ్రామిక, వ్యాపార, ఉపాధి రంగాల్లో పెట్టుబడి కోసం రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. పవర్ టిల్లర్, హార్వెస్టర్, వరి నాటు యంత్రాలు, ఆటోలు, ట్రాక్టర్లు, కోళ్ల పెంపకం, టెంట్హౌస్, డెయిరీ పరిశ్రమ, ఆయిల్ మిల్లు, పిండి మిల్లు, సిమెంట్ ఇటుకల పరిశ్రమ, హోటల్, స్టీల్, సిమెంట్ వంటి బిల్డింగ్ మెటీరియల్ షాప్స్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సెల్ఫోన్ షాప్స్, మొబైల్ టిఫిన్ సెంటర్స్, హోటల్స్, క్లాత్ ఎంపోరియం, ఫర్నిచర్ షాపు వంటి పలు రకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను గుర్తించి, వారివారి ఇష్టాన్నిబట్టి లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. దళితబంధును సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా జిల్లా, మండల, గ్రామస్థాయిలో దళితబంధు కమిటీలు ఉంటాయి. పథకం ఆశయం నెరవేరేలా దీనికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. వివిధ వ్యాపారవర్గాల సలహాలు తీసుకొని లబ్ధిదారులకు వివరిస్తాం.